పెట్రోల్ వ్యాట్ ద్వారా తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో అధిక ఆదాయం
మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ పైన వ్యాట్ ఆదాయంపై ప్రభావం పడకుండా కూడా డీజిల్ పైన రూ.2, పెట్రోల్ పైన రూ.3 తగ్గించే అవకాశముందని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం చమురు ధరలు పెరుగుతున్నప్పుడు ఇంధనంపై వ్యాట్ ద్వారా రాష్ట్రాలు రూ.49,229 కోట్ల ఆదాయాన్ని పొందాయి. కాబట్టి తక్కువ రుణ-జీడీపీ నిష్పత్తి కలిగిన మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలు డీజీల్, పెట్రోల్ పైన రూ.5 వరకు తగ్గించేందుకు అవకాశముందని తెలిపింది.
వ్యాట్ ద్వారా అధిక ఆదాయం పొందిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ వరుసగా మూడు స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది. అయితే మహారాష్ట్ర, తెలంగాణ కంటే గుజరాత్లో చమురు ధరలు చాలా తక్కువగా ఉన్నాయని, అన్నింటి కంటే ఎక్కువగా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వ్యాట్ సగటున 29 శాతం కంటే ఎక్కువగా ఉందని తెలిపింది.
ఇదిలా ఉండగా, 24 రాష్ట్రాల్లోని 70,000 పెట్రోల్ బంకులు... ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నుండి మే 31, 2022న పెట్రోల్, డీజిల్ను కొనుగోలు చేయవద్దని నిర్ణయించాయి. తమ కమిషన్లో ఎలాంటి సవరణ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు స్టేట్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ 2017 నుండి తమ కమిషన్ ఛార్జీలు పెంచలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు నిరసనగా నేడు కొనుగోలు చేయవద్దని నిర్ణయించాయి.
కాగా, పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నేడు (మంగళవారం, మే 2022) కూడా స్థిరంగా ఉన్నాయి. మోడీ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 ఎక్సైజ్ డ్యూటీ అంతకుముందు వారం తగ్గించింది. దీంతో వాహనదారులకు భారీ ఊరట కలిగింది. గత దీపావళి సమయంలో పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా రెండోసారి అంతకు రెండింతలు తగ్గించింది. కేంద్రం బాటలో రాష్ట్రాలు కూడా నడిస్తే వాహనదారులకు మరింత ఊరట కలుగుతుంది. అయితే అంతర్జాతీయంగా మాత్రం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతవారం ప్రారంభంలో 110 డాలర్ల వద్ద ఉన్న బ్రెంట్, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ ఇప్పుడు 120 డాలర్లకు చేరుకుంది.
కేంద్రం తగ్గింపును పక్కన పెడితే చమురు మార్కెటింగ్ సంస్థల పెట్రోల్, డీజిల్ ధరలు నేడు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. మోడీ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు నేపథ్యంలో నిన్న డీజిల్ ధర రూ.105.49 నుండి రూ.97.82కు తగ్గింది. నేడు యథాతథంగా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 నుండి రూ.96.72, డీజిల్ రూ.96.67 నుండి రూ.89.62కు పడిపోయింది. ముంబైలో పెట్రోల్ రూ.111.35, డీజిల్ రూ.97.28, చెన్నైలో పెట్రోల్ రూ.102.65, డీజిల్ రూ.94.24, కోల్కతాలో పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76, బెంగళూరులో పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ.87.89, గురుగ్రామ్లో పెట్రోల్ రూ.97.81, డీజిల్ రూ.90.05గా ఉంది.
దేశీయ చమురు రంగ సంస్థలు చివరిసారి 6, ఏప్రిల్ రోజున లీటర్ పెట్రోల్ పైన పెంపును అమలు చేశాయి. మార్చి 22వ తేదీ నుండి పక్షం రోజుల పాటు మొత్తం రూ.10 వరకు పెరిగింది. ఆ తర్వాత స్థిరంగా నెలకు పైగా స్థిరంగా ఉంది. అంతకుముందు నవంబర్ 4వ తేదీ నుండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. నాలుగున్నర నెలల పాటు స్థిరంగా ఉన్న ధరలు మార్చి 22వ తేదీ వరకు స్థిరంగానే కొనసాగాయి. ఆ తర్వాత పది రోజుల పాటు సవరించారు. తిరిగి స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు కేంద్రం భారీగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి వాహనదారులకు ఊరటను కల్పించింది.