SBI: స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. మళ్లీ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల పెంపు.. ఈ సారి ఎంత పెరిగాయంటే.
SBI FD Rate Hike: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ కాల వ్యవధిలోని ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. కొత్త SBI FD రేట్లు గత వారం నుంచి అమలులోకి వచ్చాయి. SBI ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు రూ.2 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ దేశీయ టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయని బ్యాంక్ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర పెంచడం కారణంగా ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
జూలై 15 నుంచి అమలులోకి..
కొత్త వడ్డీ రేట్లు జూలై 15 నుంచి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను ఒకటి నుంచి రెండేళ్లలో మెచ్యూర్ అయ్యే ఖాతాల కోసం సాధారణ ప్రజలకు 4.75 శాతం నుంచి 5.25 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు SBI FDలపై అధనంగా 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.75 శాతం వడ్డీని చెల్లిస్తోంది. బ్యాంక్ ఇతర కాలపరిమితిపై రేట్లను స్థిరంగా ఉంచింది. సవరించిన వడ్డీ రేట్లు తాజా డిపాజిట్లకు, మెచూర్ అయ్యాక పునరుద్ధరించే డిపాజిట్లపై వర్తిస్తాయని SBI వెబ్సైట్ లో వెల్లడించింది. ముందుగా ఎఫ్ డీ ఉపసంహరించుకుంటే 1 శాతం పెనాల్టీ ఉంటుందని బ్యాంక్ వెల్లడించింది.
పెరిగిన వడ్డీ రేట్ల వివరాలు ఇలా..
* 7 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.00 శాతం
* 46 రోజుల నుంచి 179 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 4.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.50 శాతం
* 180 రోజుల నుంచి 210 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.75 శాతం
* 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.00 శాతం
* 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.75 శాతం
* 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.75 శాతం
* 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.00 శాతం
* 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.00 శాతం.
వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం..
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు పెంచడంతో.. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచుతుంది. SBI బ్యాంక్.. HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులు రేట్లను పెంచటంతో ఈ నిర్ణయం తీసుకుంది. జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం 7% పైన ఉన్నందున.. RBI ఆగస్టు MPC సమావేశంలో వడ్డీ రేట్లను మరింత పెంచడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.