IT news: రూటు మార్చిన స్టార్టప్ లు.. ఇన్నాళ్లూ ఫైరింగ్, ఇప్పుడేమో హైరింగ్
IT news: టెక్ ఉద్యోగులను ఇప్పుడు ఎక్కువగా వెంటాడుతున్న భయం లేఆఫ్ లు. గతేడాది నుంచి మనదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగాల్లో కంపెనీలు కోతలు విధిస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నుంచి బయట పడటానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాయి. స్టార్టప్ లు మొదలుకొని దిగ్గజ సంస్థల వరకు ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. కానీ భారతీయ స్టార్టప్ లు ప్రస్తుతం రూటు మార్చాయి. ఇంతకాలం ఫైర్ చేసిన కంపెనీలు ఇప్పుడు హైర్ చేస్తామని చెబుతుండటం శుభపరిణామం.
ఓవైపు తొలగిస్తూనే..
లేఆఫ్ ట్రాకింగ్ సైట్ layoff.fyi డేటా ప్రకారం.. కేవలం ఈ ఏడాది మొదటి వారాల్లోనే 101 టెక్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా 25 వేలకు పైగా ఉద్యోగులను తొలగించాయి. గతేడాది చూస్తే 17 వేల మంది భారతీయ ఉద్యోగులు ఈ లేఆఫ్ ల బాధితులు. కానీ ఓవైపు సిబ్బందిని తొలగిస్తూనే మరోవైపు ప్రతిభావంతుల కోసం స్టార్టప్ లు అన్వేషిస్తున్నాయని ఆ సంస్థ చెబుతోంది. అందువల్ల నియామకాలు సైతం కొనసాగిస్తున్నాయని వెల్లడించింది.
ఇవిగో ఉదాహరణలు:
ఇటీవల 100 మందికి పైగా సిబ్బందిని తొలగించిన జొమాటో.. 800 మందిని కొత్తగా నియమించుకుంటున్నట్లు తెలిపింది. గతేడాదిలో 600 మందికి ఉద్వాసన పలికిన కార్స్ 24.. కొత్తగా 500 మందిని తీసుకోనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 2022లో 70 మందిని తొలగించిన అప్గ్రేడ్.. కొత్తగా 1,400 మందిని తీసుకుని మార్చి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్యను 9,100కి పెంచాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. గత కొంతకాలంగా మొత్తం 3,500 మందిని ఉద్యోగం నుంచి తీసేసిన బైజూస్.. ప్రస్తుతమున్న 50 వేల సిబ్బందికి అదనంగా 10 వేల మందిని రిక్రూట్ చేసుకోవాలని చూస్తోంది. మరో ఎడ్ టెక్ సంస్థ ఫిజిక్స్ వాలా సైతం తాజాగా 2,500 మంది కొత్త వారికి అవకాశం కల్పించనుంది.
వేతన పెంపునకూ నో డిమాండ్:
"స్టార్టప్లు 22 వేల మంది ఉద్యోగులను గతేడాది తొలగించాయి. జనవరి నాటికి న్యూ ఏజ్ కంపెనీల నుంచి 15 వేల యాక్టివ్ జాబ్ పోస్టింగ్లు ఉన్నాయి. కానీ డిసెంబర్లోని 16 వేల ఓపెనింగ్స్తో పోలిస్తే మాత్రం 6 శాతం తగ్గుదల ఉంది. ఇంతకు ముందు అభ్యర్థులు 100 శాతం వేతనం పెంపుదలను డిమాండ్ చేసేవారు. అందుకు విరుద్ధంగా ఇప్పుడు 50 నుంచి 60 శాతం కోసం చూస్తున్నారు" అని స్పెషలిస్ట్ స్టాఫింగ్ సంస్థ 'ఎక్స్ఫెనో' సహ వ్యవస్థాపకులు కమల్ కారంత్ తెలిపారు. ఉద్యోగాల శోధన కూడా చాలావరకు తగ్గిందన్నారు. కస్టమర్ సర్వీస్ కొలువులకు ఇప్పుడు అంతగా డిమాండ్ లేదని చెప్పారు.
నైపుణ్యం, ప్రతిభకే పట్టం:
టాప్ 60 స్టార్టప్లలో పనిచేస్తున్న 60 వేల మంది ఉద్యోగులను CIEL HR సర్వీసెస్ సర్వే చేసింది. నైపుణ్యం, ప్రతిభ, మల్టీ టాస్కింగ్, ప్రొడక్టివ్ అభ్యర్థుల కోసం న్యూ ఏజ్డ్ కంపెనీలు వెతుకుతున్నట్లు ఆ సంస్థ నివేదిక వెల్లడించింది. ఆన్ లైన్ తో పాటు భౌతికంగానూ తరగతులు నిర్వహిస్తుండటం వల్ల ఎడ్ టెక్ లకు డిమాండ్ పెరిగింది. వర్చువల్ మరియు ఫిజికల్ విధానాలు రెండూ పోటీపడటం లేదు. ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయి. తద్వారా డిమాండ్ అంతకంతకూ పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.