Srilanka: భారత్-లంకకు వారధిగా రూపాయి.. చెల్లింపులకు ఓకే చెప్పిన రిజర్వు బ్యాంక్..
Srilanka: చాలా రోజులుగా భారత్ అంతర్జాతీయ చెల్లింపుల్లో రూపాయిని వినియోగించాలని యోచిస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముందుగా డాలర్ పై ఎక్కువగా ఆధారపడటంతో రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లలో రికార్డు స్థాయిల్లో కుప్పకూలింది. దీనికి తోడు స్నేహపూర్వకమైన దేశాలు రూపాయి చెల్లింపులకు ఆసక్తి చూపటంతో భారత్ అడుగులు క్రమంగా అటువైపు పడుతోంది.
అనుమతి రావటంతో..
శ్రీలంకలో భారతీయ రూపాయిని విదేశీ కరెన్సీగా పేర్కొనడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక తెలిపిన కొన్ని రోజుల తర్వాత భారత్ నుంచి శుభవార్త వచ్చింది. సార్క్ ప్రాంతంలో వాణిజ్యం, పర్యాటకాన్ని సులభతరం చేయాలని, ప్రోత్సహించాలని శ్రీలంక RBIని అభ్యర్థించింది. ఈ క్రమంలో ఆర్బీఐ నుంచి అంగీకారం రావటంతో వోస్ట్రో ఖాతాల పేరుతో ప్రత్యేక రూపాయి ట్రేడింగ్ ఖాతాలను ద్వీపదేశంలోని బ్యాంకులు తెరిచాయి. దీనికి ముందు భారత్-రష్యా సైతం వాణిజ్య చెల్లింపుల కోసం రూపాయిని వినియోగించాలని నిర్ణయించటంతో ఇప్పటికే అది ప్రారంభమైంది.
ఎలా పనిచేస్తుంది..?
శ్రీలంక పౌరులు ఇప్పుడు తమ వద్ద 10,000 అమెరికన్ డాలర్లను భౌతికంగా కలిగి ఉన్నట్లయితే మన కరెన్సీ ప్రకారం వారు 8,26,823 భారత కరెన్సీని కలిగి ఉండవచ్చని అర్థం. ఈ ప్రకారం శ్రీలంక, ఇండియా వ్యాపారాలు పరస్పరం వాణిజ్య చెల్లింపుల కోసం ఇకపై అమెరికన్ డాలర్లకు బదులుగా భారతీయ రూపాయలను ఉపయోగించవచ్చు. ఈ ఏడాది జూలై నుంచి భారత ప్రభుత్వం డాలర్ల కొరత ఉన్న దేశాలను రూపాయి సెటిల్మెంట్ విధానంలోకి తీసుకురావాలని చూస్తోంది. ఈ విధానం పరస్పరం లాభాన్ని చేకూరుస్తుందని నిపుణులు అంటున్నారు.
శ్రీలకం ఆసక్తికి కారణం..?
శ్రీలంకలో భారతీయ రూపాయి చట్టబద్ధమైన కరెన్సీగా పేర్కొనడటం జరిగింది. దీనివల్ల తగినన్ని డాలర్లు అందుబాటులో లేకపోవటం, ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడంలో సహాయపడటానికి దేశానికి అవసరమైన ద్రవ్య మద్దతును ఈ విధానం అందిస్తుంది. ఈ చర్యలు ఆర్థిక సంక్షోభం మరింత ముదరకుండా నిరోధించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
రూపాయికి భారత్ కృషి..
ఇప్పటివరకు రష్యాతో రూపాయల్లో వాణిజ్యం కోసం 12 వోస్ట్రో ఖాతాలను తెరవడానికి భారత సెంట్రల్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. శ్రీలంకతో వాణిజ్యం కోసం ఐదు, మారిషస్తో వాణిజ్యం కోసం ఒక ఖాతాతో సహా మరో ఆరు ఖాతాలు కూడా అనుమచి పొందాయని తెలుస్తోంది. తజికిస్థాన్, క్యూబా, లక్సెంబర్గ్ మరియు సూడాన్ వంటి దేశాలు కూడా రూపాయి సెటిల్మెంట్ మెకానిజంను ఉపయోగించడం గురించి చర్చలు జరుపుతున్నాయని తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలైలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని రూపాయిలో స్థిరీకరించడానికి కొత్త యంత్రాంగాన్ని నోటిఫై చేసింది. డాలర్తో రూపాయి మారకం విలువను తగ్గించడమే కాకుండా భారత కరెన్సీని అంతర్జాతీయంగా మార్చడమే దీని లక్ష్యం.