స్పైస్జెట్పై ర్యాన్సమ్వేర్ దాడి, సేవలకు అంతరాయం
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ విమాన సేవలు బుధవారం ఉదయం ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. గుర్తు తెలియని దుండగులు చేసిన సైబర్ దాడి కారణంగా ఇది జరిగినట్లు ఓ ప్రకటనలో స్పైస్ జెట్ తెలిపింది. ర్యాన్సమ్ మాల్వేర్ దాడి వల్ల తమ వెబ్సైట్లో అంతరాయం ఏర్పడిందని పేర్కొంది. దీంతో విమానాలు ఆలస్యంగా బయలుదేరాయని వెల్లడించింది.
తమ ఐటీ బృందం సమస్యను గుర్తించి పరిష్కరించినట్లు స్పైస్ జెట్ సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఆ తర్వాత నుండి విమానాలు యథావిధిగా నడుస్తున్నాయని పేర్కొంది. బుధవారం ఉదయం గం.8.30 సమయానికి ఈ విషయాన్ని తెలిపింది. అయితే ప్రయాణీకులు మాత్రం తమకు ఎలాంటి సమాచారం వెల్లడించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియఆ వేదికగా సంస్థపై విమర్శలు గుప్పించారు. గంటల తరబడి విమానాశ్రయాల్లో వేచి చూడవలసి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. సేవలలో నాణ్యత లేదని, ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం తప్పని అభిప్రాయపడ్డారు. ర్యాన్సమ్ వేర్ అనేది ఆన్ లైన్ సేవలకు అంతరాయం కలిగించే ఓ మాల్వేర్. సైబర్ నేరగాళ్లు అనుమతి లేకుండా వెబ్ సైట్లోకి ప్రవేశించి కీలక సమాచారాన్ని ఎన్క్రిప్ట్ చేసి లాక్ చేస్తారు. వాటిని అన్ లాక్ చేయడానికి కొంత మొత్తాన్ని డిమాండ్ చేస్తారు.