SpiceJet: విమానాలకు కేంద్రం బిగ్ షాక్: సర్వీసుల నిలిపివేత: గంటన్నరపాటు
న్యూఢిల్లీ: దేశీయ ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్జెట్కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ సంస్థకు చెందిన కొన్ని విమానాల సర్వీసులను నిలిపివేయాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ఫలితంగా- ఆయా విమాన సర్వీసులు తాత్కాలికంగా స్తంభించిపోయాయి. దీన్ని పునరుద్ధరించడానికి స్పైస్జెట్ యాజమాన్యం తక్షణ చర్యలకు దిగింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలతో వందలాది మంది ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేయడానికి ప్రధాన కారణం- స్పైస్జెట్ యాజమాన్యం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు బకాయిలను చెల్లించకపోవడమే. ఫలితంగా- ఇవ్వాళ దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షెడ్యూల్ ప్రకారం బయలుదేరి వెళ్లాల్సిన 12 స్పైస్జెట్ విమానాలు సకాలంలో టేకాఫ్ తీసుకోలేకపోయాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి ఆదేశాలు అందకపోవడం వల్ల పైలెట్లు టేకాఫ్ తీసుకోలేదు.
ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం స్పైస్జెట్ విమానాలకు టేకాఫ్ తీసుకోవడానికి అవసరమైన క్లియరెన్స్లను ఇవ్వలేదని చెబుతున్నారు. తమకు బకాయిల చెల్లింపులను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తోన్నందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత సుదీర్ఘకాలం పాటు విమానాలను నడిపించలేని పరిస్థితిని ఎదుర్కొన్నందున 2020 నుంచి స్పైస్జెట్ యాజమాన్యం తన విమానాలను క్యాష్ అండ్ క్యారీ విధానంలో నడిపిస్తోంది.
ఇందులో భాగంగా ఎయిర్పోర్ట్ డ్యూటీస్ను ఎప్పటికప్పుడు చెల్లిస్తూ విమానాలను నడిపిస్తోంది. ఆ తరువాత కూడా దాన్ని కొనసాగించలేకపోయింది. ఎయిర్పోర్ట్ డ్యూటీస్, ఇతర యూజర్ ఛార్జీలను ఏ రోజుకు ఆ రోజు చెల్లించేలా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మొత్తాన్ని కూడా చెల్లించకపోవడం వల్ల ఇవ్వాళ స్పైస్జెట్ ఎయిర్వేస్కు చెందిన 12 విమాన సర్వీసులు టేకాఫ్ తీసుకోవడానికి క్లియరెన్స్ ఇవ్వొద్దంటూ ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు ఏటీసీని ఆదేశించారు.
ఆటోమేటిక్ డెయిలీ పేమెంట్స్ ప్రాసెస్.. ప్రారంభంలో స్తంభించిపోయిందని, అనంతరం మ్యానువల్గా ఆ మొత్తాన్ని సంస్థ యాజమాన్యం చెల్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ముగిసే సరికి సుమారు 90 నిమిషాల పాటు జాప్యం ఏర్పడిందని అన్నారు. ప్రస్తుతం ఆ 12 విమాన సర్వీసుల రాకపోకలు గంటన్నరపాటు ఆలస్యంతో పునఃప్రారంభం అయ్యాయని స్పష్టం చేశారు.