Sovereign gold bond: నేటి నుండే సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం సబ్స్క్రిప్షన్
సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం నేడు (జూలై 12 సోమవారం) సబ్స్క్రిప్షన్ కోసం ఓపెన్ అయింది. ఈ గోల్డ్ బాండ్ ఇష్యూ ధరను రూ.4.807గా నిర్ణయించింది కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI). సావరీన్ గోల్డ్ బాండ్స్ పైన మెచ్యూరిటీ తర్వాత మూలధన లాభాలపై పన్ను ఉండదు. ఈ పథకం 2015లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు రూ.25వేల కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం 4వ భాగం కోసం నేడు సబ్స్క్రిప్షన్ ప్రారంభమైంది.
ఇష్యూ ధర రూ.4807 కాగా, ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రూ.50 తగ్గుతుంది. ఈ సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం శుక్రవారం జూలై 16వ తేదీన ముగుస్తుంది. గోల్డ్ బాండ్స్ పెట్టుబడులకు 2.50 శాతం వార్షిక వడ్డీ రేటు లభిస్తుంది. పసిడి దిగుమతులు తగ్గించి ఆర్థిక లోటును అదుపు చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. భౌతిక బంగారు నాణేలు కొనడం, నిల్వ చేయడం, అమ్మడం వంటి ఖర్చులను ప్రభుత్వం ఆదా చేస్తోంది.
బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రకటించిన 999 స్వచ్ఛత బంగారం ముగింపు సగటు ధర ఆధారంగా సబ్స్క్రిప్షన్ కాలానికి ముందు వారంలోని చివరి 3 పని దినాల ధర ఆధారంగా గోల్డ్ బాండ్ ధర భారత కరెన్సీ రూపాయిలలో నిర్ణయిస్తారు. 1 గ్రామ్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఎనిమిదేళ్లు బాండ్ పీరియడ్ ఉంటుంది. 5వ సంవత్సరం తర్వాత నిష్క్రమణకు అవకాశముంది. మెచ్యూరిటీ ధర అప్పటి ధరపై ఆధారపడి ఉంటుంది.
వ్యక్తులు గరిష్టంగా నాలుగు కిలోలు, హెచ్యూఎఫ్ 4 కిలోలు, ట్రస్ట్లకు 20 కిలోల వరకు కొనుగోలు చేయవచ్చు. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎంపిక చేయబడిన పోస్టాఫీస్లు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీలు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ ఆఫ్ ఇండియా, బాంబే స్టాక్ ఎక్స్చేంజీల్లో విక్రయిస్తారు.