కస్టమర్లకు గుడ్న్యూస్: ఏ ఏటీఎంలోనైనా క్యాష్ డిపాజిట్! నకిలీతో చిక్కు
బ్యాంకు కస్టమర్లకు శుభవార్త! త్వరలో మీరు ఏ బ్యాంకు ఖాతాదారు అయినప్పటికీ మరో బ్యాంకు ఏటీఎంకు వెళ్లి క్యాష్ డిపాజిట్ చేసే వెసులుబాటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) దేశంలోన్ని అన్ని మేజర్ బ్యాంకులకు ప్రపోజల్ పంపించింది. దేశంలోని అన్ని రిటైల్ పేమెంట్స్ కూడా NPCI గొడుకు కింద ఉంటాయి. NPCI ఇదివరకే బ్యాంకుల మధ్య నగదు బదలీ కోసం UPI విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది.
అమెజాన్ జెఫ్ బెజోస్కు షాకిచ్చేందుకు ఇండియన్ ట్రెడర్స్ రెడీ!
NFSతో సాధ్యం...
ఇందులో భాగంగా ఓ బ్యాంకు కస్టమర్ మరో బ్యాంకుకు వెళ్లి తన అకౌంటులో డబ్బులు డిపాజిట్ చేసుకునే సౌకర్యానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని NPCI పేర్కొంది. బ్రాంచీల నుంచి కూడా ఇతర బ్యాంకుల ఖాతాలకు డబ్బు పంపించడాన్ని అనుమతిని పరిశీలిస్తోంది. ఈ కొత్త డిపాజిట్ విధానం తమ నేషనల్ ఫైనాన్స్ స్విచ్ (NFS) సాధ్యమని చెబుతోంది. NFS విధానాన్ని ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (IDBRT) తయారు చేసింది.
ఖర్చు తగ్గుతుంది.
ఏ బ్యాంకు ఏటీఎంలో అయినా క్యాష్ డిపాజిట్ చేయడం లేదా బ్రాంచీ డిపాజిట్ విధానం ద్వారా నగదు సరఫరాకు అయ్యే ఖర్చు తగ్గుతుందని చెబుతున్నారు. అంతేకాదు, ఏటీఎం మిషన్లలో నగదుని తిరిగి నింపేందుకు ఏటీఎం ఆపరేటర్లకు ఖర్చు కూడా తగ్గుతుందని చెబుతున్నారు. డిపాజిట్ చేసిన మనీని ఉపసంహరణ కోసం రీసైకిల్ చేయవచ్చునని చెబుతున్నారు. కస్టమర్లు డిపాజిట్ చేసిన మనీయే విత్ డ్రాకు ఉపయోగపడుతుంది.
నకిలీ కరెన్సీ డిపాజిట్ చేసే అవకాశాలు
అన్ని మేజర్ ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు కూడా ఏటీఎం క్యాష్ డిపాజిట్ నెట్ వర్క్లో చేరాలని కోరామని, అయితే దీనిని అమలు చేయడానికి ముందు ఇందులోని ఇబ్బందులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని, ఏటీఎం ద్వారా నకిలీ కరెన్సీ డిపాజిట్ చేసే అవకాశాలు ఉంటాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, అన్నింటిని పరిశీలించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే 14 బ్యాంకులు అమలు
దేశంలో ఇప్పటికే 14 బ్యాంకులు ఏటీఎం క్యాష్ డిపాజిట్ నెట్ వర్క్ను అమలు చేస్తున్నాయి. NPCI ద్వారా పెద్ద బ్యాంకులకు చెందిన 30వేల ఏటీఎంలలో క్యాష్ డిపాజిట్ సదుపాయాన్ని అమలు చేయవచ్చునని NPCI అంచనా వేసింది. దీనికి హార్డ్ వేర్లోను పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.
బ్యాంకు, కస్టమర్.. ఇరువురికీ ప్రయోజనం
ఇంటర్ఆపరేబుల్ క్యాష్ డిపాజిట్ ద్వారా ఇటు బ్యాంకులు, అటు కస్టమర్లకు ప్రయోజనం అని NPCI భావిస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో క్యాష్ హ్యాండ్లింగ్ ఖర్చులు తగ్గుతాయి. అలాగే కస్టమర్లకు కూడా అందుబాటులో ఉన్నదాంట్లో డిపాజిట్ చేయవచ్చునని చెబుతోంది.
ప్రస్తుతం ఈ బ్యాంకుల్లో..
ప్రస్తుతం యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు, సౌత్ ఇండియన్ బ్యాంకులు ఏటీఎం క్యాష్ డిపాజిట్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. NPCI కోరుకున్నట్లు అన్ని బ్యాంకుల్లోను ఇది అమలులోకి వస్తే ఏ బ్యాంకు ఖాతాదారు అయినా ఏ బ్యాంకుకు అయినా వెళ్లి డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు.