తెలంగాణలో త్వరలో కొత్త ఐటీ పాలసీ: మోడీకి కేటీఆర్ వృద్ధి విజ్ఞప్తి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఐటీ విధానాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. గతంలో అద్భుత ఫలితాలిచ్చిన ప్రస్తుత ఐటీ విధానం పంథాలోనే రానున్న అయిదేళ్ల కోసం దీనిని ఆవిష్కరిస్తామన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వచ్చేలా ఇది ఉంటుందన్నారు. అదే సమయంలో అందరికీ ఆన్లైన్, మొబైల్ సేవలు అందించేలా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న ఐటీ విధానం అయిదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో కొత్త ఐటీ పాలసీపై ఆయన అధికారులతో సమావేశమయ్యారు.
ఐటీ పాలసీ
ప్రభుత్వ ఆఫీస్ల ద్వారా అందించే పౌరసేవల్ని రాబోయే తరానికి చేరువయ్యేలా ఐటీ శాఖ దృష్టి పెట్టాలని కేటీఆర్ అన్నారు. భవిష్యత్తులో ప్రజలకి అందుబాటులోకి రానున్న టీఫైబర్ నెట్ వర్క్ ద్వారా అందించాల్సిన కార్యక్రమాలపై ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. దీని ద్వారా తమ గడప నుండే ప్రభుత్వ సేవలు పొందేలా చూడాలన్నారు.
సాంకేతిక అభివృద్ధిని ఆలంబనగా చేసుకొని సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ తొలి ఐటీ పాలసీ రాష్ట్రానికి సరికొత్త దిశను, దశను తీసుకు వచ్చిందన్నారు. ప్రస్తుత పాలసీ ద్వారా కొత్త పెట్టుబడుల ఆకర్షణ, కొత్త పరిశ్రమలకు అనుమతుల ద్వారా ఎంతోమందికి ఉపాధి దొరికిందన్నారు.
పౌరుడే కేంద్రంగా
పెట్టుబడులతో పాటు ఐటీ శాఖ ద్వారా ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలపై దృష్టి సారించినట్లు కేటీఆర్ తెలిపారు. పౌరుడే కేంద్రంగా ప్రభుత్వ సేవలు అందించేందుకు కృషి చేస్తామని, ఎలక్ట్రానిక్ పాలన, ఆన్ లైన్, మొబైల్ కార్యకలాపాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సేవలు అందించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అనేక నూతన విధానాలకు రూపకల్పన చేసిందని, ఆరేళ్లుగా ఇవి ఎంతో ఫలితాలిచ్చాయన్నారు.
ప్రోత్సహించండి
ఇదిలా ఉండగా, మంచి ప్రదర్శన చేసే రాష్ట్రాలకు కేంద్రం ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిలో పరుగెత్తే రాష్ట్రాలను ప్రోత్సహించాలని, అభివృద్ధిలో భాగస్వాములుగా చేయాలన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీతో అంతగా మేలు జరగలేదన్నారు. బుల్లెట్ రైలు అహ్మదాబాద్కు వెళ్తుందని, హైస్పీడ్ రైలు ముంబై వద్దే ఆగిపోతోందన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక రాజధాని వద్దే నిలిచిపోతోందన్నారు.