త్వరలో బ్యాడ్ బ్యాంకు, ప్రభుత్వ వాటా 51 శాతం: త్వరలో కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మొండి బకాయిల పరిష్కారంలో భాగంగా ప్రతిపాదిత బ్యాడ్ బ్యాంకు లేదా నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(NARCL) ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ త్వరలో ఆమోదం తెలపనుంది. NARCL జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్కు ప్రభుత్వం గ్యారెంటీగా ఉండే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర పడే అవకాశముందని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి.
బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)కు అప్పగించింది. ప్రభుత్వ హామీ తక్షణం రూ.31,000 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.
85 శాతం ఆమోదానికి...
మొండి బకాయిలకు సంబంధించి ఆమోదిత వ్యాల్యూలో 15 శాతం NARCL నగదులో చెల్లిస్తుంది. మిగతా 85 శాతం ప్రభుత్వ హామీతో కూడిన సెక్యూరిటీ రిసిట్స్గా ఉంటాయని పేర్కొంటున్నారు. NARCL జారీ చేసే సెక్యూరిటీ రిసిట్స్కు సావరిన్(ప్రభుత్వ) గ్యారెంటీ లభించేందుకు కేబినెట్ ఆమోదం తప్పనిసరి అని చెబుతున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంలో బ్యాడ్ బ్యాంకు ఏర్పాటును ప్రస్తావించారు. దీనికి త్వరలో కేబినెట్ ఆమోదం లభిస్తుందని అంటున్నారు.
బ్యాంకు బుక్స్ను క్లియర్ చేసేందుకు...
ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిల నేపథ్యంలో బ్యాంక్ బుక్స్ను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు నిర్మలమ్మ బడ్జెట్ సమయంలో తెలిపారు. ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్న వివిధ బ్యాంకుల ఎన్పీఏలను ఏకీకృతం చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ఇందుకోసం అసెట్ రీ-కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
51 శాతం వాటా ప్రభుత్వ బ్యాంకులది..
NARCLలో ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా 51 శాతంగా ఉంటుంది. మిగిలిన వాటాను ప్రయివేటురంగ బ్యాంకులకు ఉంటుంది. NARCLలో 12 శాతం వాటాతో లీడ్ స్పాన్సర్గా ఉండాలని కెనరా బ్యాంకు భావిస్తోంది. తొలి దశలో బ్యాడ్ బ్యాంకుకు బదలాయించడానికి 22 ఎన్పీఏలను గుర్తించారని తెలుస్తోంది. వీటి వ్యాల్యూ దాదాపు రూ.89,000 కోట్లు. వచ్చే కొద్ది కాలంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల ఎన్పీఏలను NARCL కంపెనీ నిర్వహిస్తుందని అంచనా.