Smart Phones: స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. పండక్కి భారీ ఆఫర్లు.. సిద్ధమైన కంపెనీలు..
Discounts On Smart Phones: కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఈ సారి పండగ సీజన్లో మొబైల్ ఫోన్లు తక్కువ ధరకే లభించనున్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ ఛానెల్స్ లో వివిధ రకాల తగ్గింపులు, ఆఫర్లను చూడవచ్చని మార్కెట్ వర్గాలు, రిటైలర్లు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల డిమాండ్ భారీగా ప్రభావితమైంది. కంపెనీల వద్ద భారీ మెుత్తంలో ఇన్వెంటరీలు పేరుకుపోయాయి. ఈ స్టాక్స్ క్లియర్ చేయడానికి భారీ తగ్గింపులు, వివిధ ఆఫర్లను అందించడానికి కంపెనీలు సిద్ధం కావడానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆన్లైన్ డిస్కౌంట్ అమ్మకాలు Q2 2022లో పుంజుకున్నాయి. రాబోయే త్రైమాసికాల్లో అమ్మకాలు మరింత పుంజుకోవచ్చని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇన్వెంటరీ పెరిగిందని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అరవిందర్ ఖురానా తెలిపారు.
డిమాండ్ పంజుకునేందుకు..
ఈ పండుగ సీజన్లో భారతీయ మార్కెట్లో భారీ తగ్గింపులను చూడవచ్చని వినియోగదారుల మార్కెట్ ట్రెండ్లను ట్రాక్ చేసే సంస్థ స్ట్రాటజీ అనలిటిక్స్లో సీనియర్ అనలిస్ట్ రాజీవ్ నాయర్ తెలిపారు. ఈ క్యాలెండర్ సంవత్సరం మొదటి అర్ధభాగంలో డిమాండ్ బలహీనంగా ఉంది. ద్వితీయార్ధంలో కంపెనీలు దానిని భర్తీ చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తాయని రీసెర్చ్ సంస్థ అంచనాలు చెబుతున్నాయి.
ఆఫ్లైన్ స్టోర్స్ ఆకర్షణీయమైన తగ్గింపులు..
బ్రాండ్లు తమ వెబ్సైట్లు లేదా ఆఫ్లైన్ స్టోర్ల ద్వారా విక్రయించే స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందించవచ్చని టెలికాం విశ్లేషకుడు అభిలాష్ కుమార్ తెలిపారు. వీటిలో EMI ఆప్షన్లపై ఆఫర్లు కూడా ఉన్నాయి. భారీ తగ్గింపులు ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి ఒక మార్గమని ఆయన అన్నారు. దీని గురించి ఆఫ్లైన్ రిటైలర్లను ప్రశ్నించగా.. వారి వద్ద భారీ మెుత్తంలో స్టాక్స్ ఉన్నట్లు తేలిందని ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలోనే.. స్మార్ట్ఫోన్ తయారీదారులు జూన్లో ఆఫ్లైన్ రిటైలర్ల మార్జిన్లను పెంచారు. ఇది ఆఫ్లైన్ ఛానెల్స్ లో కూడా డిస్కౌంట్ ఆఫర్లను పెంచడానికి రిటైల్ విక్రయదారులకు అవకాశం ఇస్తుంది.
అమ్ముడుపోని 80 మిలియన్ యూనిట్లు..
స్మార్ట్ఫోన్లను తయారు చేస్తున్న చైనా కంపెనీలు దేశీయ మార్కెట్లో తమ ఇన్వెంటరీని కూడా పెంచుకున్నాయి. అదే సమయంలో.. వారు తూర్పు యూరప్లో కూడా స్మార్ట్ఫోన్లను విక్రయించడానికి కష్టపడుతున్నారు. ప్రస్తుతం వారి దగ్గర 50 మిలియన్ల నుంచి 80 మిలియన్ యూనిట్ల వరకు ఇన్వెంటరీ ఉండవచ్చని స్ట్రాటజీ అనలిటిక్స్ డైరెక్టర్ శ్రవణ్ కుండోజ్లా తెలిపారు. కొన్ని యూనిట్లు భారత మార్కెట్కు రవాణా అయ్యే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఇందులో అమ్ముడుపోని మెుబైళ్లు Samsung కంపెనీ దగ్గర ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు 168 మిలియన్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్కు రవాణా చేశాయని తెలుస్తోంది. కాబట్టి, పండుగల సమయంలో భారీ ఆఫర్లను ప్రకటించి ఈ స్టాక్స్ వదిలించుకోవాలని దిగ్గజ కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగదారులు సైతం తెలివిగా ఉపయోగించుకోవచ్చు.