ఊరట: భారత ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్య
కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో జీడీపీ 23.9 శాతం మేర ప్రతికూలత నమోదు చేసింది. రానున్న రెండు క్వార్టర్లలో కాస్త పుంజుకున్నప్పటికీ మైనస్లలోనే నమోదు కావొచ్చునని, నాలుగో క్వార్టర్ నాటికి కాస్త పాజిటివ్ కనిపించవచ్చునని పలువురు ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా భారత జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వరకు ప్రతికూలత ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ ఓ శుభవార్త చెప్పారు.
దారుణంగా దెబ్బతిన్నాం, ఇదిగో... భారత ఆర్థిక వ్యవస్థ V షేప్ రికవరీ
సానుకూల వృద్ధి ఉండవచ్చు
'ఇండియాస్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అండ్ పాలసీ ఆప్షన్స్-ఎమర్జింగ్ ఫ్రమ్ ది పాండమిక్స్ షాడో' అనే అంశంపై ఈవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్తో కలిసి రంగరాజన్ ఓ పత్రాన్ని రూపొందించారు. ఇందులో కొంత ఆశావహ దృక్పథం కనిపించింది. కరోనా ప్రభావం ఉన్ప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ కొంత సానుకూల ఆర్థిక వృద్ధినినమోదు చేసే అవకాశాలను కొట్టి పారేయలేమని పేర్కొన్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు జీడీపీ తగ్గుతుందని భావిస్తున్నాయని, దీనిని ప్రపంచ బ్యాంకు 3.2 శాతంగా, ఎస్బీఐ 6.8 శాతంగా అంచనా వేస్తున్నాయని, కానీ జీడీపీ అంతకంటే ఎక్కువే ఉండవచ్చునని విశ్వసించేందుకు పలు కారణాలు ఉన్నాయని తెలిపారు.
కాస్త సానుకూలం.. కారణాలివే..
వ్యవసాయం, అనుబంధ రంగాలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ సర్వీస్, ఇతర సేవలు, నిత్యావసర వస్తువులు, సేవలు వంటివి మొదటి క్వార్టర్లో పూర్తిగా పని చేశాయని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాల నుండి పెట్టుబడులను ఆకర్షఇంచడంలో క్రియాశీలకంగా ఉన్నాయన్నారు. ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, పైరంగాలు కలిపి మొత్తం ఉత్పాదనలో 40 శాతం నుండి 50 శాతం వరకు ఉంటాయని గుర్తు చేశారు. ఇవి మొదటి త్రైమాసికం నుండి పని చేస్తున్నాయని, కాబట్టి 2020-21 పూర్తిస్థాయి ఆర్థిక వ్యవస్థలో దాదాపు సగం సాధారణ లేదా సాధారణం కంటే మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
పెట్టుబడుల ఆకర్షణకు..
కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో కార్పోరేట్ పన్నులను తగ్గించిందని గుర్తు చేశారు. తద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారన్నారు. ఈ కారణాలన్నింటితో చిన్న సానుకూల వృద్ధిని తోసిపుచ్చలేమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఖర్చులు పెరగడం అనివార్యమని, అలాగే అప్పులు పెరగడం కూడా తప్పదన్నారు. మోనెటైజేషన్కు పరిమితి ఉందనే విషయాన్ని పాలకులు గుర్తెరగాలన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిని ధీటుగా ఎదుర్కోవాలని అభిప్రాయపడ్డారు.