క్రెడిట్ గ్యారెంటీ ఉన్నా.. నో యూజ్.. చిన్న కంపెనీలకు దొరకని లోన్
ఆర్థిక మాంద్యం, కరోనా వైరస్ వల్ల చిన్న కంపెనీల పరిస్థితి దయనీయంగా మారింది. క్రెడిట్ గ్యారెంటీ ఉన్నా లోన్ దొరకని పరిస్థితి ఏర్పడింది. కుటీర, చిన్న, మధ్య తరహా సంస్థలకు లోన్లు ఇవ్వడం తగ్గిపోయింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం జూలై చివరి నాటికి ఎంఎస్ఎంఈలకు లోన్లు గతేడాదితో పోలిస్తే 4.96 శాతం తగ్గిపోయాయి. దేశ జీడీపీలో 25 శాతం వరకు కంట్రిబ్యూట్ చేసే చిన్న సంస్థల కోసం ప్రభుత్వం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్లను ప్రవేశపెట్టింది.
ప్రభుత్వ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్.. ఆర్బీఐ కూడా చిన్న సంస్థలకు చౌకగా అప్పులు వచ్చేలా చర్యలు తీసుకుంది. కానీ బ్యాంక్లు మాత్రం ఈ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్లను వినియోగించుకోవడం లేదు. కరోనా షాక్తో అప్పులు ఇవ్వడం తగ్గిపోతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా తన రీసెర్చ్ నోట్లో వివరించింది. ఆగస్ట్ వరకు ఎంఎస్ఎంఈలకు జారీ చేసిన క్రెడిట్ అప్పులు రూ. లక్ష కోట్లుగా ఉన్నా, మొత్తంగా చూసుకుంటే అప్పులు దొరకడం తక్కువగానే ఉంది.
చిన్న సంస్థలకు సాయం చేసేందుకు ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ ప్రవేశపెట్టింది. దీని కింద 100 శాతం గ్యారెంటీ ఇస్తోంది. ఈ మే నెల నుంచి స్కీమ్ అమల్లోకి వచ్చింది. అప్పటినుంచి చిన్న సంస్థలకు లోన్లు అందుబాటులోకి రావడం లేదు. తమ అప్పులు తేలికగా దొరకడం లేదని చిన్న సంస్థలు చెబుతున్నాయి.