టార్గెట్ 5ట్రిలియన్ డాలర్లు: రూ.102 లక్షల కోట్ల ఇన్ఫ్రా ప్లాన్ రిలీజ్
న్యూఢిల్లీ: రానున్న అయిదేళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గతంలో కంటే రెండింతలు ఖర్చు చేసే ప్రణాళికలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఆవిష్కరించారు. గత ఆరేళ్లలో కేంద్రం, రాష్ట్రాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.51 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందని, ఇప్పుడు దానిని రెట్టింపు చేసి రూ.105 లక్షల కోట్లు లేదా రూ.105 ట్రిలియన్లు ఖర్చు చేయనున్నట్లు నిర్మల తెలిపారు.
ఇన్ప్రాస్ట్రక్చర్ బ్లూప్రింట్ను కేంద్రం నియమించిన టాస్క్ ఫోర్స్ తయారు చేసింది. దీనిని సీతారామన్ ఆవిష్కరించారు. ఈ ప్యానెల్ గత నాలుగైదు నెలల్లో స్టేక్ హోల్డర్స్తో 70పర్యాయాలు భేటీ అయిందని, ఈ సంప్రదింపుల అనంతరం రూ.102 లక్షల కోట్ల ప్రాజెక్టులను గుర్తించిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ 5 మిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని, ఇప్పుడు మౌలిక సదుపాయాల పెట్టుబడులను రూ.100 లక్షల కోట్లకు పెంచడం దానికి ఓ అడుగు అన్నారు.
త్వరపడండి!: 2020లో రూ.45,000కు చేరుకోనున్న బంగారం!!
జాతీయ మౌలిక సదుపాయాల పైప్లైన్లో కేంద్రం, రాష్ట్రాల వాటా 39 శాతం చొప్పున (రెండింటిది 78 శాతం) ఉంది. 22 శాతం ప్రయివేట్ సెక్టార్ది 2025 నాటికి ప్రయివేటు రంగ సహకారం 30 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా 2020 రెండో అర్ధ సంవత్సరంలో గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ జరగనుందని చెప్పారు.
పవర్, రైల్వే, అర్బన్ ఇరిగేషన్, మొబిలిటీ, రెనెవబుల్ ఎనర్జీ, రైల్వేస్, అర్బన్ డెవలప్మెంట్, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ వంటి రంగాల్లో ప్రాజెక్టులను టాస్క్ ఫోర్స్ గుర్తించినట్లు చెప్పారు. దాదాపు రూ.25 లక్షల కోట్ల ఎనర్జీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయని, మరో రూ.20 లక్షల కోట్ల ప్రాజెక్టులు రోడ్డు, రూ.14 లక్షల కోట్ల ప్రాజెక్టులు రైల్వేకు సంబంధించినవి అన్నారు.