రిలయన్స్ రిటైల్లో సిల్వర్ లేక్ రూ.7,500 కోట్ల పెట్టుబడి
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL)లో సిల్వర్ లేక్ రూ.7500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ప్రీ-మనీ ఈక్విటీ వ్యాల్యూ రూ.4.21 లక్షల కోట్ల వద్ద RRVL ఈ పెట్టుబడులు పెడుతోంది. రూ.7500 కోట్లతో రిలయన్స్ వెంచర్స్లో 1.75 శాతం వాటాను సొంతం చేసుకోనుంది సిల్వర్ లేక్. ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు రిలయన్స్ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి రిలయన్స్ జియోలోకి 1.35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. రిలయన్స్ - సిల్వర్ లేక్ డీల్ నేపథ్యంలో రిలయన్స్ షేర్ వ్యాల్యూ 1 శాతం మేర పెరిగింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకోదు, షాకింగ్ రిపోర్ట్: భారత ఆర్థిక వ్యవస్థపై ఏమన్నారంటే?
రిలయన్స్ అనుబంధ సంస్థల్లో రెండో పెట్టుబడి
సిల్వర్ లేక్ ఇంతకుముందు జియోలో పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు రిలయన్స్ వెంచర్పై దృష్టి సారించింది. జియోలో రూ.10,202.55 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. తాజా పెట్టుబడితో రిలయన్స్లో రిలయన్స్ రిటైల్, జియో ప్లాట్ఫాం వ్యాల్యుయేషన్ రూ.9 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ లిమిటెడ్. ఇది భారతదేశంలో అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. రిలయన్స్ రిటైల్ తన వ్యాపారాన్ని అంతకంతకూ విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రిలయన్స్ రిటైల్కు దేశవ్యాప్తంగా 12,000 స్టోర్స్ ఉన్నాయి.
మరిన్ని వాటాల విక్రయం
డిజిటల్ అనుబంధ విభాగం జియో బాటలోనే రిలయన్స్ రిటైల్లోను మైనార్టీ వాటా విక్రయం ద్వారా మరిన్ని నిధులు సమకూర్చుకునే ప్లాన్లో ముఖేష్ అంబానీ ఉన్నట్లుగా భావిస్తున్నారు. కంపెనీ వృద్ధి కోసం రిలయన్స్ వివిధ అవకాశాల్ని పరిశీలిస్తోంది. రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు కూడా రిలయన్స్ రిటైల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తే ముఖేష్ అంబానీ సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. రిలయన్స్ రిటైల్లో పది శాతం వరకు వాటాను విక్రయించే ఆలోచనతో ఉన్నారని తెలుస్తోంది.
ముఖేష్ అంబానీ ఏమన్నారంటే
సిల్వర్ లేక్ పెట్టుబడులపై ముఖేష్ అంబానీ స్పందించారు. భాగస్వామ్యం మరింతగా ముందుకు సాగటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రిటైల్ సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో సంస్కరణలు తెచ్చిందని, ఇండియన్ రిటైల్లో తమ దార్శనికతను అమలు చేయడంలో సిల్వర్ లేక్ విలువైన పాత్ర పోషిస్తోందని చెప్పారు. దేశవ్యాప్తంగా చిన్న వర్తకులతో కలిసి వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు.