పరుగులు తీస్తున్న స్టాక్.. రైల్వే నుంచి వేల కోట్ల ఆర్డర్.. డివిడెండ్ కూడా చెల్లిస్తోంది
Rocket Stock: కొన్ని కంపెనీల షేర్లు అనూహ్యంగా పెరుగుతుంటాయి. అయితే అలా ఎందుకు జరుగుతుందనేది స్టాక్ మార్కెట్లో రోజూ ట్రేడింగ్ చేసేవారికి తెలుసు. భలమైన కారణం లేదా ప్రకటన ఉన్నప్పుడే షేర్ల ధరలు జంప్ చేస్తుంటాయి. ఈ క్రమంలో డివిడెండ్ చెల్లించటానికి సిద్ధమైన ఒక కంపెనీ షేర్లు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి.
భారీ ఆర్డర్..
1867 నుంచి వ్యాపారంలో ఉన్న కంపెనీ Siemens Ltd. అయితే తాజాగా కంపెనీ భారతీయ రైల్వేల నుంచి ఒక భారీ ఆర్డర్ అందుకుంది. ఈ ఆర్డర్ విలువ దాదాపు రూ.26,000 కోట్లని వెల్లడి కావటంతో ఇన్వెస్టర్లలో జోష్ నిండింది. దీంతో షేర్ ధర ఒక్కసారిగా ర్యాలీని ప్రారంభించింది. ఈ క్రమంలో నేడు 4.65 శాతం మేర పెరిగి మార్కెట్ ముగిసే సమయానికి రూ.3,082.35వద్ద ట్రేడింగ్ ముగించింది. ఈ క్రమంలో కేవలం ఒక్కరోజే స్టాక్ రూ.136.90 పెరిగింది.
గడచిన ఆరు నెలల్లో..
గడచిన ఆరు నెలల కాలాన్ని పరిశీలిస్తే స్టాక్ ఏకంగా 14.81 శాతం మేర పెరిగింది. అలాగే ఏడాది కాలంలో షేర్ ధర దాదాపు 30 శాతం వృద్ధిని నమోదు చేసింది. రైల్వే శాఖ నుంచి రూ.26,000 కోట్ల విలువైన కాంట్రాక్టును పొందినట్లు సీమెన్స్ లిమిటెడ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఆర్డర్ వివరాలు..
కంపెనీ విడుదల చేసిన వివరాల ప్రకారం 1,200 ఎలక్ట్రిక్ ఫ్రైట్ (కంటెయినర్లు) తయారీకి సంబంధించిన ఆర్డర్ ను రైల్వేల నుంచి పొందింది. వీటిని కంపెనీ 11 ఏళ్ల లోపు తయారు చేసి అందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వాటికి 35 ఏళ్ల పాటు సర్వీస్ సేవలను కూడా SIEMENS అందించాల్సి ఉంది. సీమెన్స్ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.3,138.50గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.2,150.10 వద్ద ఉంది.
డివిడెండ్ ప్రకటన..
సీమెన్స్ లిమిటెడ్ స్టాక్ తన ఇన్వెస్టర్లకు డివిడెండ్ చెల్లించాలని ఇటీవల నిర్ణయించింది. అర్హత కలిగిన పెట్టుబడిదారులకు ఒక్కో షేరుపై రూ.10 డివిడెండ్ చెల్లిస్తామని స్టాక్ ఎక్స్ఛేంజీకి వెల్లడించింది. దీనికోసం కంపెనీ జనవరి 31, 2023ను రికార్డు తేదీగా నిర్ణయించింది. దీనికోసం షేరుకు జనవరి 30ని ఎక్స్-డివిడెండ్ తేదీగా నిర్ణయించింది. అంటే ఈ తేదీన కంపెనీ రికార్డుల్లో షేర్లను కలిగి ఉన్న వారికి ఈ ప్రయోజనం ఉంటుందని తెలుస్తోంది.