మారటోరియం మరో 3 నెలలు పొడిగింపుపై ప్రకటన ఎప్పుడు?
దేశ ప్రజలందరికీ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి శుభవార్త చెప్పనుంది. కరోనా వైరస్ వ్యాప్తి తో దేశంలో అన్ని కార్యకలాపాలు స్తంభించిపోవటంతో రుణాల చెల్లింపు వాయిదా వేసుకునేలా ఇప్పటికే 3 నెలల మారటోరియం ప్రకటించింది. మార్చి నుంచి మే నెల వరకు ఈ మారటోరియం వర్తిస్తుంది. కానీ దేశంలో లాక్ డౌన్ అనుకున్న సమయానికి ఎత్తివేయలేదు. సరికదా ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. దీంతో తాజాగా మే 17 వరకు దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రజలకు తాము తీసుకున్న రుణాల చెల్లింపు ఇబ్బందిగా పరిణమిస్తోంది.
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఆర్బీఐ త్వరలోనే మరో 3 నెలల మారటోరియం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు పలు వ్యాపార సంఘాలు కూడా ప్రభుత్వానికి, ఆర్బీఐ కు వినతులు సమర్పించాయి. తయారీ రంగంతో పాటు అన్ని రంగాలు కుదేలై పోయిన ప్రస్తుత సమయంలో రుణాల చెల్లింపులకు కొంత ఊరట లభించక పొతే దేశంలో మొండి బకాయిలు భారీగా పెరిగిపోయే ప్రమాదం ఉంది.
లాక్డౌన్లో భారీ ఊరట: లోన్లపై మరో 3 నెలలు మారటోరియం పొడిగింత
చేయాల్సిందే అంటున్న బ్యాంకింగ్ అసోసియేషన్...
ప్రస్తుతం అమల్లో ఉన్న 3 నెలల మారటోరియం ను మరో 3 నెలలు పొడిగించి మొత్తంగా 6 నెలల మారటోరియం ప్రకటించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ప్రతిపాదిస్తోంది. దేశంలోని బ్యాంకులకు ప్రాతినిధ్యం వహించే ఐబీఏ కు బ్యాంకింగ్ రంగంలోని వాస్తవిక పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన ఉంటుంది.
అందుకే, కేవలం వ్యాపార, పారిశ్రామిక వర్గాలే కాకుండా ... తొలిసారి ఒక బ్యాంకింగ్ అసోసియేషన్ కూడా మారటోరియం కు మద్దతు పలకటం విశేషం. ఒక వేళ మారటోరియం పొడిగింపు జరగక పోతే మెజారిటీ ప్రజలు రుణాలను సక్రమంగా చెల్లించే పరిస్థితులు లేవు. అదే గనుక జరిగితే మొండి బకాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. అప్పుడు మొత్తం బ్యాంకింగ్ రంగ ఆస్తిస్త్వమే ప్రమాదంలో పడే ఆస్కారం ఉంటుంది.
ఈ వారంలోనే ప్రకటన?
దేశంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గత శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తొలుత మారటోరియం ను పొడిగించాలనే అంశమే ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. అలాగే, ఇతర ఆర్థిక సంస్థలకు నిధుల ప్రవాహం వంటి అంశాలు కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ గవర్నర్ త్వరలోనే మారటోరియం మరో 3 నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనాన్ని బట్టి చూస్తే... మరో రెండు మూడు రోజుల్లో నే ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ఈ వారంలోనే రుణ గ్రహీతలకు గుడ్ న్యూస్ లభించవచ్చు.
అందరిదీ అదే మాట...
ఆర్బీఐ గతంలో ఇచ్చిన గడువు ఈ నెల 31 తో ముగుస్తుంది. అంటే మళ్ళీ జూన్ 1 నుంచే అందరూ తమ తమ రుణాల కిస్తీలు (ఈఎంఐ) చెల్లించటం ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ... లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తూ పోతున్నారు. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగితే... ప్రజల వద్ద నిధుల లభ్యత అసలు లేని సందర్భంలో వారు రుణాలు ఎలా చెల్లించగలరని నిపుణుల ప్రశ్న.
చాలా మందికి ఉద్యోగాలు లేక, లేదా జీతాల్లో కోత పడి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి సందర్భంలో అసలు బ్రతకడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. రుణాలు చెల్లించటం వంటివన్నీ తరువాతి స్థానంలో ఉంటాయి. కాదు.. కూడదు అంటే... అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆదాయానికి భరోసా లేనప్పుడు అప్పులు కట్టడం ఎవరికైనా ఇబ్బందికరమే. అందుకే, ప్రభుత్వ రంగ బ్యాంకులతో సహా అందరూ మరో 3 నెలల మారటోరియం ప్రకటించి ప్రజలందరికీ ఉపశమనం కల్పించాలని సూచిస్తున్నారు.