అమెజాన్కు ఎంత నమ్మకమో: వొడాఫోన్ ఐడియాలో రూ.20 వేల కోట్ల ప్రవాహం
ముంబై: సుదీర్ఘకాలంగా పెద్దగా ఎలాంటి కదలికలు లేకుండా ఉన్న వొడాఫోన్ ఐడియా షేర్ల ధరలు ఇవ్వాళ ఒక్కసారి పెరిగాయి. ఈ పెరుగుదల కేవలం అయిదు శాతం. అయినప్పటికీ.. పెద్ద సంఖ్యలో షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు కొత్తగా ఊపిరి పోసింది ఈ పరిణామం. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో అయిదు శాతానికి పైగా వొడాఫోన్ ఐడియా షేర్ల ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది.
దీనికి కారణం.. ఇ-కామర్స్ జెయింట్ అమెజాన్ ఈ టెలికం ఆపరేటర్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతుందనే వార్తలు రావడం. అలాంటిలాంటి ఇన్వెస్ట్మెంట్ కాదు. ఏకంగా 20,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టడానికి అమెజాన్ యాజమాన్యం సన్నాహాలు చేస్తోందనే వార్తలు వెలువడ్డాయి. దాని ప్రభావం వొడాఫోన్ ఐడియా షేర్ల మీద పడింది. వాటి ధరల్లో పెరుగుదల కనిపించింది. అయిదు శాతం అంటే 50 పైసల మేర పెరిగాయి వాటి రేట్లు.
ఇంట్రాడే హై రూ.9.40 పైసలకు టచ్ చేసింది. సాయంత్రానికి మరింత పెరుగుతందని, 10 రూపాయల బ్యారికేడ్ను దాటొచ్చనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. ఈ పరిణామాలతో రిటైల్ ఇన్వెస్టర్లు వొడాఫోన్ ఐడియా షేర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. రెండు గంటల వ్యవధిలో 223.91 లక్షల షేర్లు అమ్ముడయ్యాయి. 20.46 కోట్ల రూపాయల మేర ట్రేడింగ్ సంభవించింది. ఈ టెలికం ఆపరేటర్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 29,934 కోట్ల రూపాయలు.
వొడాఫోన్ ఐడియా యాజమాన్యం కొద్ది రోజులుగా ఇన్వెస్టర్ల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తోంది. తనకు ఉన్న రుణాలను తీర్చుకోవడం.. అతి పెద్ద టాస్క్గా మారింది. దీనితో పెట్టుబడిదారుల కోసం అన్వేషణ చేస్తోంది. ఈ ప్రయత్నాలు కొంతవరకు ఫలించినట్టేనని చెప్పుకోవచ్చు. జెఫ్ బెజోస్ సారథ్యంలోని అమెజాన్.. ఏకంగా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిందంటూ వార్తలు వెలువడ్డాయి.