2010 నుండి ఐపీవోకు వచ్చిన PSUల్లో సగం భారీ నష్టాల్లోనే
పార్టీలతో సంబంధం లేకుండా కేంద్రంలో పలు ప్రభుత్వాలు ఉన్నప్పటికీ వివిధ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ (PSU)లు ఐపీవోకు వచ్చాయి. అధికారంలో ఉన్న పార్టీతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం PSUలతో ఐపీవోకు వెళ్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. వివిధ పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు పలు PSUలు ఐపీవోకు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఇష్యూ ధర కంటే వాటి వ్యాల్యూ తక్కువగా ఉంది.
ఇటీవల ఎల్ఐసీ ఐపీవోకు వచ్చిన విషయం తెలిసిందే. రూ.930కు పైగా ధరతో ఐపీవోకు వచ్చిన ఎల్ఐసీ షేర్ పక్షం క్రితం రూ.867 వద్ద లిస్ట్ అయింది. ఇప్పుడు అంతకంటే పడిపోయింది. నేడు మధ్యాహ్నం గం.1.45 సమయానికి ఎల్ఐసీ షేర్ వ్యాల్యూ 0.40 శాతం క్షీణించి రూ.810.90 వద్ద కదలాడింది. అయితే ఎల్ఐసీ ఒక్కటే కాదు, వివిధ PSU స్టాక్స్ లిస్టింగ్ కంటే కింద కదలాడుతున్నాయి.
22 కంపెనీల్లో సగం అంతే
2010 నుండి 22 PSUలు ఐపీవోకు రాగా, ఇందులో దాదాపు సగం ఇష్యూ ధరతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 22 కంపెనీల ఐపీవో ద్వారా రూ.77,000 కోట్లు సమీకరించింది. ఇందులో ఎల్ఐసీ ఐపీవో ద్వారానే రూ.21వేల కోట్లకు పైగా వచ్చాయి.
ఇవి మాత్రమే లాభాల్లో
ఇప్పటి వరకు వచ్చిన 22 PSUలలో కేవలం ఏడు ఎంఎస్టీసీ లిమిటెడ్, ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్, రెయిల్ వికాస్ నిగమ్, మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్, ఆర్ఐటీఈఎస్ లిమిటెడ్, మిశ్రా దాతు నిగమ్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ మాత్రమే మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, జనరల్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలు ఇష్యూ ధర కంటే తక్కువకు పడిపోయాయి.
90 శాతం క్షీణించిన ఇక్రాన్
2018 సెప్టెంబర్లో ఇక్రాన్ రూ.475 ధరతో ఐపీవోకు వచ్చింది. ఈ స్టాక్ ప్రస్తుతం రూ.40 వద్ద ఉంది. అంటే 90 శాతం క్షీణించింది. జనరల్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ 2017 అక్టోబర్లో ఐపీవోకు వచ్చింది. ఇది 74 శాతం క్షీణించింది. న్యూ ఇండియా అసురెన్స్, కోహిన్ షిప్ యార్డ్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు, మోయిల్ లిమిటెడ్, కోల్ ఇండియా 5 శాతం నుండి 7 శాతం నష్టపోయాయి. ఎల్ఐసీ ఇష్యూ ధర రూ.949 కాగా, ప్రస్తుతం రూ.810 వద్ద ఉంది.