విమాన ప్రయాణికులకు మరో గుడ్న్యూస్: కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: విమానయాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో తీపికబురును అందించింది. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో రద్దు చేసిన భోజన సౌకర్యాన్ని పునరుద్ధరించింది. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. కరోనా వైరస్ ప్రొటోకాల్స్కు లోబడి.. వాటిని అనుసరిస్తూ ప్రయాణికులకు భోజనాన్ని అందించవచ్చని తెలిపింది. దీనికోసం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేకంగా ప్రొటోకాల్స్ లిస్ట్ను తెప్పించుకుంది.
తెలంగాణకు కేంద్రం మొండిచెయ్యి: ఏపీకి భారీగా గ్రాంట్: 19 రాష్ట్రాలకు నిధులు
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో భాగంగా- ఇదివరకు విమాన సర్వీసుల్లో భోజన సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. గత సంవత్సరం కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆ తరువాత వాటిని పునరుద్ధరించినప్పటికీ.. భోజన వసతిని మాత్రం అందుబాటులోకి తీసుకుని రాలేదు. ఎలాంటి ఆహారాన్ని కూడా అందివ్వకూడదంటూ అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది.
ఈ సంవత్సరం కూడా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దాన్ని కొనసాగింపజేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో డొమెస్టిక్ విమాన సర్వీసులను రద్దు చేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులకూ బ్రేక్ వేసింది. ఆ తరువాత సెకెండ్ వేవ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడం, రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోండటంతో డొమెస్టిక్ విమాన సర్వీసులను పునరుద్ధరించింది. అంతర్జాతీయ విమానాలపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. తన నిషేధాన్ని కొనసాగిస్తోంది. ఈ నెల చివరి వరకూ ఈ నిషేధం అమల్లో ఉంది.
కాగా- ఈ పరిస్థితుల మధ్య దేశీయ విమాన సర్వీసుల్లో భోజన సదుపాయాన్ని తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణ సమయం రెండు గంటలలోపు ఉండే విమానాల్లో ప్రయాణికులకు భోజనాన్ని అందించవచ్చంటూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలను జారీ చేసింది. విమాన సిబ్బంది, ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ ప్రొటోకాల్స్ను అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
కాగా- దేశంలో కొత్తగా 11,850 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 555 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 3,44,26,036కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,36,308గా రికార్డయింది. ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 4,63,245కు చేరింది. కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల్లో క్షీణత తగ్గుతూనే వస్తోంది. మరణాల సంఖ్య మాత్రం అదుపులోకి రావట్లేదు. కొత్తగా 555 మంది మరణించారు.