కుప్పకూలిన మార్కెట్లు: సెన్సెక్స్ 812 పాయింట్లు డౌన్, కారణాలు ఇవే..
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కాసేపు ఊగిసలాటలో కనిపించాయి. చివరలో అమ్మకాల ఒత్తిడితో ఒక్కసారిగా కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 812 పాయింట్లు(2.09 శాతం) నష్టపోయి 38,034.14 వద్ద, నిఫ్టీ 254 పాయింట్లు (2.21 శాతం) నష్టపోయి 11,250.55 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ 34 పాయింట్లతో 38వేల దిగువ ప్రమాదాన్ని తప్పించుకుంది. ఇటీవల 39వేలు దాటిన సెన్సెక్స్ 38,000 స్థాయికి దిగి వచ్చింది. 11,500కు పైగా ఉన్న నిఫ్టీ ఇప్పుడు 11,300 కంటే దిగువకు వచ్చింది.
టెలికం, రియాల్టీ కుప్పకూలాయి
అన్ని రంగాలు కూడా భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ టెలికం, రియాల్టీ షేర్లు 6 శాతం మేర కుప్పకూలాయి. మెటల్, ఆటో షేర్లు 5 శాతం మేర నష్టపోయింది. టాప్ గెయినర్స్ జాబితాలో కొటక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ మాత్రమే ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా మోటార్స్, హిండాల్కో, జేఎస్డబ్ల్యు స్టీల్స్, టాటా స్టీల్ ఉన్నాయి.
మార్కెట్ నష్టాలకు కారణం..
వ్యవసాయ బిల్లు పైన రాజ్యసభలో కేంద్రప్రభుత్వానికి సవాళ్లు ఎదురు అవుతున్నాయి. చైనాతో సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి. యూరోపియన్ దేశాల్లో తిరిగి తలెత్తుతున్న కరోనా వైరస్ కేసులు, దేశంలోను పెరుగుతున్న కేసులు వంటి వివిధ కారణాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. రెండోసారి లాక్ డౌన్ విధించే యోచన ఉన్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. దీనికి తోడు గ్లోబల్ బ్యాంకుల్లో అవకతవకలు జరిగాయని వెలువడిన ఆరోపణలు ఇన్వెస్టర్లలో ఆందోళనలను మరింతగా పెంచాయి.
దిగ్గజ కంపెనీలు బేజారు
ముఖ్యంగా ఐసీఐసీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్ వంటి ప్రధాన షేర్లపై అమ్మకాల ఒత్తిడి ప్రభావం చూపింది. దీంతో మార్కెట్లు వరుసగా మూడో సెషన్లో నష్టపోయాయి. అయితే ఐపీవోకు వచ్చిన రూట్ మొబైల్స్ లిమిటెడ్ మాత్రం భారీగా దూసుకెళ్ళింది. షేర్ ధర రూ.350 వద్ద ప్రారంభం కాగా, రూ.650 వద్ద ముగిసింది. 85 శాతం లాభంతో క్లోజ్ అయింది. రిలయన్స్ షేర్ ధర 2.42 శాతం, ఎయిర్టెల్ షేర్ ధర 5.46 శాతం మేర, ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్ ధర 8.52 శాతం మేర నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో ఐటీ షేర్లు 0.7 శాతం మేర నీరసించాయి. మిగతా షేర్లు 2.5 శాతం నుండి 6 శాతం మేర పతనమయ్యాయి.