రెండు రోజుల్లో రూ.6 లక్షల కోట్లు ఎగిసిన ఇన్వెస్టర్స్ సంపద
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా భారీ లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో దాదాపు 600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, నేడు 1128 పాయింట్లు ఎగిసింది. అంతకుముందు రెండు సెషన్లలో 1600 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్, ఈ రెండు రోజుల్లో అంతకు మించి పైకెగిసింది. సెన్సెక్స్ నేడు 50,000 మైలురాయిని క్రాస్ చేసింది. నిఫ్టీ 14,800 పాయింట్ల పైన స్థిపడింది. బీఎస్ఈ 30 సూచీలో మూడు స్టాక్స్ తప్ప మిగతా కంపెనీలు అన్నీ లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, HDFC బ్యాంక్, HCL టెక్, ఇన్ఫోసిస్, నెస్లే, NTPC షేర్లు మూడు శాతానికి పైగా ఎగిశాయి. నిఫ్టీలో రియాల్టీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి.
రూ.6 లక్షల కోట్లు జంప్
నేడు సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా ఎగిసిపడటంతో ఇన్వెస్టర్ల సంపద నేడు ఒక్కరోజే రూ.3.54 లక్షల కోట్లు ఎగిసింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.204.81 లక్షల కోట్లకు (రూ.2,04,77,472.33) ఎగిసింది. వరుసగా రెండు సెషన్లలో సెన్సెక్స్ భారీ లాభాల్లో ముగిసింది. దీంతో ఈ రెండు సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్లు (రూ.6,02,001.9 కోట్లు) ఎగిసింది.
ఈ స్టాక్స్ అదుర్స్
బీఎస్ఈ 30 షేర్ ఇండెక్స్ మంగళవారం 50,136.58 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు 2.30 శాతం ఎగిసింది. నిఫ్టీ కూడా దాదాపు అంతేస్థాయిలో లాభపడింది. 7.27 శాతం జంప్ చేసి యూపీఎల్ టాప్ గెయినర్గా నిలిచింది. ఆ తర్వాత జేఎస్డబ్ల్యు స్టీల్ 5.07 శాతం ఎగిసింది. టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, నెస్ట్లే, విప్రో, హెచ్యూఎల్, శ్రీసిమెంట్స్, దివిస్ ల్యాబ్స్, ఎన్టీపీసీ, బ్రిటానియా, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, సిప్లా, ఐచర్ మోటార్స్, టైటాన్ కంపెనీ, టీసీఎస్ ఉన్నాయి.
నజారా టెక్నాలజీస్
రాకేష్ ఝున్ఝూన్వాలాకు చెందిన నజారా టెక్నాలజీస్ అదిరిపోయే లిస్టింగ్కు వచ్చింది. ఇష్యూ ధర రూ.1,101 కాగా, 80 శాతం ఎగిసి రూ.2,026.90కు చేరుకుంది. అయితే ఈ స్థాయిలో నిలదొక్కలేకపోయినప్పటికీ చివరకు 43.22 శాతం లాభపడి 1,576.80 వద్ద ముగిసింది. లార్జ్ క్యాప్ సూచీలతో పోలిస్తే మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అంతగా ఎగిసిపడలేదు. మిడ్ క్యాప్ సూచీ 0.98 శాతం లాభపడింది.