నష్టాల నుంచి లాభాల బాటపట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ మార్కెట్లు శుక్రవారం ఆశ్చర్యకరంగా లాభాలను నమోదు చేశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రభావంతో గురువారం భారీగా నష్టపోయిన దేశీయ మార్కెట్లు ఇవాళ నష్టాలను పూడ్చుకుంటూ వచ్చి లాభానాలను నమోదు చేయడం విశేషం.
రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ వంటి షేర్ల అండతో పుంజుకున్నాయి. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే దాదాపు 1100 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ అనంతరం తిరిగి కోలుకుంది. మధ్యాహ్నం చివరి రెండు గంటల్లో అనూహ్యంగా పుంజుకోవడంతో గురువారం నాటి నష్టాలను భర్తీ చేసింది.
మొత్తంగా 242.2 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 33,780.89 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 70.90 పాయింట్లు లాభపడి 9,972.90 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.84గా ఉంది.
నిఫ్టీలో మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఇన్ఫ్ట్రాటెల్, శ్రీ సిమెంట్స్, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్ షేర్లు లాభపడ్డాయి. జీ ఎంటర్టైన్మెంట్, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, విప్రో షేర్లు నష్టపోయాయి.
రంగాలవారీగా చూసుకుంటే ఆటో షేర్లకు కొనుగోలు మద్దతు లభించగా, ఐటీ, పవన్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా కదలాడాయి.