సెన్సెక్స్ 600 పాయింట్లు జంప్, మార్కెట్ భారీ లాభాలకు కారణాలివే
ముంబై: ఈ వారంలో రెండు రోజుల పాటు మార్కెట్లు తెరుచుకోగా, ఈ రెండు సెషన్లలోనే దాదాపు వెయ్యి పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్ నేడు 600 పాయింట్లకు పైగా ఎగిసింది. సూచీలు నేడు దుమ్ము రేపాయి. సెన్సెక్స్ మళ్లీ 53,000 దిశగా పరుగెడుతుండగా, నిఫ్టీ 15,800 పాయింట్లు దాటింది. మొన్న సెన్సెక్స్ 52,198 పాయింట్ల వద్ద క్లోజ్ కాగా, నిన్న సెలవుదినం. అయితే నేడు ప్రారంభంలోనే దాదాపు 300 పాయింట్లు ఎగిసింది. ఏ దశలోను తగ్గలేదు. అంతకంతకూ పైకి చేరుకుంది. నిఫ్టీ కూడా భారీగా లాభపడింది.
మార్కెట్ లాభాలకు కారణాలు
అమెరికాలో డెల్టా వేరియంట్ భయాలతో కొద్ది రోజులుగా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కానీ వ్యాక్సీన్ పనితీరు అద్భుతంగా ఉందని అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్నారు. దీంతో మళ్లీ అగ్రరాజ్యం మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్ పైన కనిపించింది. కరెన్సీ మార్కెట్ కూడాా అప్రమత్తంగా ఉంది. ఇది సూచీలపై ప్రభావం కనిపించింది.
అమెరికా డాలర్ అప్రమత్తంగా కదలాడింది. మూడు నెలల క్రితం డాలర్ సూచీ 93.194 వద్ద ఉండగా, ఇప్పుడు అది 92.812కు తగ్గింది. కార్పోరేట్ ఫలితాలు సానుకూలంగా ఉండటంతో బాండ్ ఈల్డ్స్ పెరిగాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకున్నాయి. జపాన్, సిడ్ని, హాంగ్కాంగ్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి.
సెన్సెక్స్, నిఫ్టీ క్లోజ్
సెన్సెక్స్ నేడు ఉదయం 52,494.56 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,864.82 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,471.23 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,736.60 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,825.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,726.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 638.70 (1.22%) పాయింట్లు ఎగిసి 52,837.21 పాయింట్ల వద్ద, నిఫ్టీ 191.95 (1.23%) పాయింట్లు లాభపడి 15,824.05 పాయింట్ల వద్ద ముగిసింది.
రేపు జొమాటో లిస్టింగ్
జొమాటో రేపు లిస్టింగ్కు రానుంది. గ్లాండ్ ఫార్మా ఎనిమిది నెలల్లో ఐపీవో ధరతో పోలిస్తే 177 శాతం పెరిగింది. హిందూస్తాన్ యూనీలీవర్ నెట్ ప్రాఫిస్ FY22 మొదటి త్రైమాసికంలో 11 శాతం ఎగిసింది. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో JSW స్టీల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫిన్ సర్వ్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో HUL, ఏషియన్ పేయింట్స్, బజాజ్ ఆటో, సిప్లా, HDFC లైఫ్ ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, HDFC బ్యాంకు ఉన్నాయి.