6 రోజుల్లో రూ.11 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి, ఈరోజే రూ.4 లక్షల కోట్లు హుష్కాకి
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (సెప్టెంబర్ 24) కుప్పకూలాయి. సెన్సెక్స్ 1,114.82 పాయింట్లు(2.96%) పతనమై 36,553.60 పాయింట్ల వద్ద, నిఫ్టీ 326.40 పాయింట్లు (2.93%) పడిపోయి 10,805.50 వద్ద ముగిసింది. రెండు రోజుల క్రితం కూడా సెన్సెక్స్ 812 పాయింట్లు నష్టపోయింది. గత ఆరు సెషన్లుగా మార్కెట్లు నష్టాల్లో ముగుస్తున్నాయి. గత వారం చివరి రెండు సెషన్లు, ఈ వారంలోని నాలుగు సెషన్లలో (మొత్తం 6) సెన్సెక్స్ మొత్తం 2,750 పాయింట్ల మేర నష్టపోయింది. మొన్నటి వరకు ఐటీ స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. రెండు రోజులుగా ఐటీ స్టాక్స్ కూడా నష్టాల్లోకి వెళ్లిపోయాయి.
కూలిన మార్కెట్ ఆశలు: 1,100పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, కాపాడి.. భారీగా దెబ్బకొట్టిన 'ఐటీ'
రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఈ రోజు సెన్సెక్స్ 1,115 పాయింట్ల మేర నష్టపోయింది. నిఫ్టీ 326 పాయింట్లు కోల్పోయింది. ఈ రోజు ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్ సెక్టార్ ఎక్కువగా దెబ్బతీసింది. సెన్సెక్స్లో ఇన్ఫోసిస్ (150 పాయింట్లు), రిలయన్స్ (143.34 పాయింట్లు), టీసీఎస్ (130 పాయింట్లు), ఐసీఐసీఐ బ్యాంకు (100.53 పాయింట్లు), హెచ్డీఎఫ్సీ బ్యాంకు (65.67 పాయింట్లు) ఎక్కువగా దెబ్బతీసింది.
ఈ ఒక్కరోజే రూ.391 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. మూడు రోజుల క్రితం రూ.4.60 లక్షల కోట్ల సంపద పడిపోయింది. మొత్తంగా ఈ ఆరు సెషన్లలో రూ.11.3 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద నష్టపోయింది.
అనిశ్చితులతో.. డాలర్ దిశగా
ఆర్థిక పునరుద్ధరణకు సంబంధించిన అనిశ్చితులు, వైరస్ వ్యాప్తి పెరుగుదల వంటి వివిధ అంశాలు మార్కెట్ నష్టాలకు కారణమయ్యాయి. అమెరికా డాలర్ వ్యాల్యూ సిక్స్ బాస్కెట్ కరెన్సీలో రెండు నెలల గరిష్టానికి చేరుకొని,94.480 వద్ద ఉంది. ఈక్విటీ మార్కెట్, బంగారం అస్థిరత సహా అన్ని అంశాలు డైలమాలో ఉండటానికి తోడు, డాలర్ బలపడుతుండటంతో ఇన్వెస్టర్లు రూటు మార్చారని చెబుతున్నారు. బంగారం ధరలు ఈ వారం రూ.2500కు పైగా క్షీణించింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు.
52 వారాల గరిష్టానికి..
ఇదిలా ఉండగా, ఏంజిల్ బ్రోకింగ్ ఐపీవో సబ్స్క్రిప్షన్ దాదాపు నాలుగు రెట్లుగా ఉంది. ఈ రోజు నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ బ్యాంకు బిగ్గెస్ట్ లూజర్స్గా ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ మే 22 తర్వాత మరోసారి భారీగా క్షీణించింది. ఓ వైపు మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ఉండగా 89 స్టాక్స్ 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. ఇందులో అడ్వాన్స్డ్ ఎంజైమ్, అపోలో హాస్పిటల్స్, సింజెన్ ఇంటర్నేషనల్ వంటివి ఉన్నాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్లో కేవలం హిందూస్తాన్ యూనీలీవర్ మాత్రమే లాభాల్లో ముగిసింది. టీసీఎస్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్లు 5.5 శాతం నుండి 7 శాతం మేర నష్టపోయాయి.