మళ్లీ అదే.. భారీ నష్టాల్లో మార్కెట్లు: సెన్సెక్స్ 1,500 పాయింట్లు డౌన్, యస్ బ్యాంకు దూకుడు
కరోనా మహమ్మారి కారణంగా భారత స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లు బుధవారం ఊగిసలాటలో ప్రారంభమై.. ఆ తర్వాత మధ్యాహ్నానికి భారీ నష్టాల్లోకి వెళ్లాయి. కరోనా కారణంగా అంతర్జాతీయంగా మార్కెట్లు డైలమాలో ఉన్నాయి. ఆ ప్రభావం మన మార్కెట్లపై కూడా పడింది. ఉదయం గం.9.18 సమయానికి సెన్సెక్స్ 501.46 పాయింట్లు (1.64%) నష్టపోయి 31,080.55 వద్ద, నిఫ్టీ 148.70 పాయింట్లు (1.66%) నష్టపోయి 9115.75 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత కాసేపటికి సెన్సెక్స్ 500 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 8,800 సమీపంలో నిలిచింది. మధ్యాహ్నం గం.2 సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,461.45 (4.78%) పాయింట్లు నష్టపోయి 29,117.64 వద్ద, నిఫ్టీ 8,600 పాయింట్లకు దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ మూడేళ్ల కనిష్టానికి చేరుకుంది.
మధ్యాహ్నం గం.11.30 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, యస్ బ్యాంకు, వేదాంత, విప్రో, సన్ ఫార్మా ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, కొటక్ మహీంద్రా, ఇండస్ ఇండి బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, గెయిల్ ఉన్నాయి. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా, ఐటీ, మెటల్, ఫార్మా, పీఎస్యూ అన్నీ నష్టాల్లో ట్రేడింగ్ను ప్రారంభించాయి.
నిన్నటి వరకు భారీ లాభాలు చూసిన యస్ బ్యాంకు షేర్లు బుధవారం కూడా లాభాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించింది. ఈ రోజు సాయంత్రం మారటోరియం ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఓ సమయంలో దాదాపు 50 శాతం పెరిగి రూ.87.95కి చేరుకుంది. మధ్యాహ్నానికి షేర్ 5.46 శాతం పెరిగి రూ.62కు చేరుకుంది. వొడాఫోన్ ఐడియా షేర్లు ఏకంగా 40 శాతం మేర నష్టపోయాయి.