మార్కెట్ సరికొత్త రికార్డులు: సెన్సెక్స్ 872 పాయింట్లు జంప్, కారణాలివే...
స్టాక్ మార్కెట్లు మంగళవారం (ఆగస్ట్ 3) భారీ లాభాల్లో ముగిశాయి. నిన్న భారీగా లాభపడిన సూచీలు నేడు అంతకుమించిన ఉత్సాహంతో పరుగులు పెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండడం అంతర్జాతీయ సూచీలను కలవరానికి గురి చేస్తోంది. అమెరికా మార్కెట్లు సోమవారం అప్రమత్తంగా కదిలాయి. నేడు ఆసియా మార్కెట్లు కూడా అలాగే ఉన్నాయి.
అయితే త్రైమాసిక ఫలితాలు బలంగా ఉండడం, తయారీ కార్యకలాపాలు పుంజుకోవడం భారత మార్కెట్లు మాత్రం దుమ్ము రేపాయి. ఉదయం 9.30 గంటల సమయానికి 240 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ మధ్యాహ్నానికి దాదాపు 900 పాయింట్లకు పైగా లాభాల్లోముగిసింది.
సెన్సెక్స్ 872 పాయింట్లు జంప్
సెన్సెక్స్ నేడు 872 పాయింట్ల లాభాల్లో ముగిసింది. నేడు ఉదయం 53,125.97 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,887.98 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,088.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 872.73 (1.65%) పాయింట్లు లాభపడి 53,823.36 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా సరికొత్త రికార్డును తాకింది.
ఉదయం 15,951.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,146.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,914.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు నిఫ్టీ 245.60 (1.55%) పాయింట్లు లాభపడి 16,130.75 పాయింట్ల వద్ద ముగిసింది. నిన్న కూడా మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. నిన్న సెన్సెక్స్ 363.79 (0.69%) పాయింట్లు ఎగిసి 52,950.63 పాయింట్ల వద్ద, నిఫ్టీ 122.10 (0.77%) పాయింట్లు ఎగిసి 15,885.15 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.74.33 వద్ద ట్రేడ్ అయింది.
టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 3.38 శాతం, HDFC 3.76 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 3.45 శాతం, నెస్ట్లే 3.21 శాతం, ఎస్బీఐ 2.67 శాతం, లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో JSW స్టీల్ 0.86 శాతం, బజాజ్ ఆటో 0.35 శాతం, శ్రీ సిమెంట్స్ 0.31 శాతం, టాటా స్టీల్ 0.20 శాతం, ఎన్టీపీసీ 0.08 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో SBI, HDFC, అదానీ పోర్ట్స్, TCS, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి.
కారణాలివే..
సెన్సెక్స్, నిఫ్టీ నేడు సరికొత్త రికార్డుతో ముగిశాయి. నిఫ్టీ మొదటిసారి 16,000 దాటగా, సెన్సెక్స్ 53,800 దాటి, 54000 దిశగా పరుగులు పెడుతోంది. ఉదయం నుండి లాభాల్లో ఉన్న మార్కెట్లు, మధ్యాహ్నం గం.1 సమయానికి కూడా 500 పాయింట్లకు పైగా లాభాల్లో ఉన్నాయి. ఆ తర్వాత కూడా మరింత పరుగులు పెట్టి చివరకు 872 పాయింట్ల లాభంతో ముగిసింది.
టెక్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ స్టాక్స్ భారీగా ఎగిసిపడ్డాయి. నిఫ్టీ ఎప్ఎంసీజీ దాదాపు 1.73 శాతం లాభపడింది. నిఫ్టీ ఐటీ 1.18 శాతం, ఫైనాన్షియల్ స్టాక్స్ 1.68 శాతం లాభపడ్డాయి. బలమైన కార్పోరేట్ ఫలితాలు, ఐపీవోకు మంచి స్పందన రావడం, బలమైన జీఎస్టీ కలెక్షన్స్ మార్కెట్ దూకుడుకు కలిసి వచ్చాయి.