సెన్సెక్స్ రికార్డ్, నిఫ్టీ దూకుడు: 2009 తర్వాత బిగ్గెస్ట్ సింగిల్ డే పెరుగుదల
కరోనా ప్రభావంతో గత వారం భారీ నష్టాలు చవిచూసిన మార్కెట్లు నేడు మంగళవారం (ఏప్రిల్ 7) లాభాల్లో ముగిశాయి. సోమవారం ప్రపంచ మార్కెట్లు స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. దీంతో ఆసియా మార్కెట్లు, భారత మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇటలీ, స్పెయిన్ సహా వివిధ దేశాల్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో మార్కెట్ల సెంటిమెంట్ బలపడింది. ఉదయం వెయ్యికి పైగా పాయింట్లతో లాభపడిన సెన్సెక్స్ ఆ తర్వాత అదే ఒరవడి కొనసాగించింది.
ఐటీ కంపెనీల గుడ్న్యూస్: డోంట్ వర్రీ.. ఆఫర్ వచ్చిందా.. మీ ఉద్యోగం మీకే!
30 వేల మార్క్ దాటిన సెన్సెక్స్
సెన్సెక్స్ ఉదయం గం.9.40 సమయానికి 1,200 పాయింట్లు లాభపడి 28,800 పాయింట్లు దాటింది. నిఫ్టీ 344 పాయింట్లు ఎగిసి 8,434 వద్ద ట్రేడ్ అయింది. డాలరుతోను రూపాయి మారకం విలువ 76 వద్ద ట్రేడ్ అయింది. మార్కెట్లు సాయంత్రం వరకు అదే ఒరవడి కొనసాగించాయి. సెన్సెక్స్ ఏకంగా 2,476 పాయింట్ల లాభంతో 30 వేల మార్క్ దాటింది. నిఫ్టీ 9,000 సమీపానికి వచ్చింది.
2009 మే తర్వాత తొలిసారి
ఇంట్రాడేలో ఒకానొక దశలో 2,566.7 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 30,157 టచ్ చేసి, చివరకు 8.97 శాతం లేదా 2,476.26 పాయింట్ల లాభంతో 30,067.21 వద్ద ముగిసింది. నిఫ్టీ 708.40 పాయింట్లు లేదా 8.76 శాతం ఎగిసి 8,792.20 వద్ద స్థిరపడింది. 2009 మే తర్వాత ఇదే అత్యంత పెరుగుదల. అంటే దశాబ్దం తర్వాత ఒకేరోజు ఇంత శాతం పెరుగుదల మొదటిసారి. పాయింట్ల పరంగా చూస్తే సెన్సెక్స్ 2,476 పాయింట్లు సింగిల్ డే రికార్డ్.
అన్నీ లాభాల్లోనే..
సెన్సెక్స్లో అన్ని కంపెనీల షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు 22 శాతం లాభాల్లో ముగిసింది. యాక్సిస్ బ్యాంకు, మహింద్రా అండ్ మహింద్రా, ఐసీఐసీఐ, హెచ్యూఎల్, మారుతీ, హెచ్సీఎల్ టెక్, హీరో మోటో కార్పు షేర్లు భారీగా పెరిగాయి. బీఎస్ఈ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు దాదాపు ఆరు శాతం లాభపడ్డాయి.