సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్: పతనమైన మార్కెట్లు.. రిలయన్స్, HDFC సహా కారణాలివే
ముంబై: ఈవారంలో స్టాక్ మార్కెట్లు మరో రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. రెండు రోజుల క్రితం 540 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్.. ఈరోజు ఏకంగా 600 పాయింట్ల మేర కుప్పకూలింది. ఉదయం నుండి నష్టాల్లోనే ఉన్న మార్కెట్లు ఏ దశలోను కోలుకోలేదు. పైగా గంటగంటకూ మరింత నష్టాల్లోకి కుంగిపోయాయి.
సెన్సెక్స్ 599.64 పాయింట్లు (1.48 శాతం) నష్టపోయి 39,922.46 వద్ద, నిఫ్టీ 157.70 పాయింట్లు(1.33 శాతం) క్షీణించి 11,729.60 పాయింట్ల నద్ద ముగిసింది. సెన్సెక్స్ 40వేల మార్క్ కిందకు వచ్చింది. 979షేర్లు లాభాల్లో, 1606 షేర్లు నష్టాల్లో ముగియగా, 153 షేర్లలో ఎలాంటి మార్పులేదు. అన్ని రంగాలు కూడా నష్టాల్లో ముగిశాయి.
ఈసారి భారత జీడీపీ సున్నా, ప్రపంచ వేగవంత ఆర్థిక వ్యవస్థగా..: మోడీతో నిర్మల భేటీ
భారీ నష్టానికి కారణాలు
సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు దాదాపు 1.5 శాతం మేర నష్టపోయాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో కరోనా కేసులు పెరగడం, ఆయా దేశాల్లో మరోసారి లాక్ డౌన్ భయాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లు నష్టపోయాయి. ఈ ప్రభావం భారత్ సహా ఆసియా మార్కెట్లపై పడింది.
అలాగే కీలకమైన రంగాలు, స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్స్, బ్యాంకులు దెబ్బతీశాయి. అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో నిన్నటి లాభాలు నేడు హరించుకుపోయాయి.
యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ భారీగా నష్టపోయాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం.2 సమయానికి డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ 467 పాయింట్లు (1.71 శాతం) క్షీణించి 26,898 వద్ద, నాస్డాక్ 100 ఫ్యూచర్ 107 పాయింట్లు (0.93 శాతం) నష్టపోయి 11,480, ఎస్ అండ్ పీ 500 ఫ్యూచర్స్ 42 పాయింట్లు (1.26 శాతం) కోల్పోయి 3,340 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
ఇక, డాలర్ మారకంతో రూపాయి 16 పైసలు క్షీణించి 73.87 వద్ద ముగిసింది. ఉదయం 73.70 వద్ద ప్రారంభమైంది. మంగళవారం 73.71 వద్ద క్లోజ్ అయింది. నేడు 73.64-73.93 మధ్య ట్రేడ్ అయింది.
మార్కెట్ను కిందకు లాగిన బ్యాంకింగ్, రిలయన్స్
అన్ని రంగాల్లో నిఫ్టీ బ్యాంకు భారీగా నష్టపోయింది. ఇది ఏకంగా 2 శాతం క్షీణించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు స్టాక్ 3.54 శాతం, హెచ్డీఎఫ్సీ స్టాక్ 1.85 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 3.10 శాతం, కొటక్ మహీంద్ర బ్యాంకు 1.99 శాతం భారీగా నష్టపోయాయి. క్రితం వారం బ్యాంకింగ్ స్టాక్స్ భారీ లాభాలు చవిచూశాయి. బ్యాంకింగ్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది.
రిలయన్స్ స్టాక్ 1.26 శాతం మేర నష్టపోయి రూ.2,009 వద్ద ముగిసింది.
సెన్సెక్స్, నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతానికి పైగా నష్టపోయింది.
43 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. టాప్ లూజర్స్లో బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్నాయి.
నిఫ్టీ బ్యాంకు 537 పాయింట్లు నష్టపోయి 24,233 వద్ద, మిడ్ క్యాప్ సూచీ 170 పాయింట్లు కోల్పోయి 17,048 వద్ద ముగిసింది.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ స్టాక్స్ 3 శాతం మేర క్షీణించాయి. అంచనాలకు మించి లాభాలు నమోదు చేసినా ఈ స్టాక్స్ నష్టపోవడం గమనార్హం.
భారతీ ఎయిర్టెల్ టాప్ నిఫ్టీ గెయినర్గా ఉంది. స్టాక్స్ 3 శాతం లాభపడ్డాయి. ఓ సమయంలో 10 శాతం ఎగిశాయి.
టైటాన్ 1 శాతం నష్టంతో ముగిసింది.
మారికో 2 శాతం లాభపడింది.
రూట్ మొబైల్స్ 10 శాతం లాభపడింది. రెండో త్రైమాసికం ఫలితాల నేపథ్యంలో ఈ స్టాక్ ఎగిసింది.
మిడ్ క్యాప్లో ఏంజెల్ బ్రోకింగ్, అదానీ గ్రీన్, హ్యాపీయెస్ట్ మైండ్స్, పీటీసీ ఫైనాన్స్ భారీగా లాభపడ్డాయి.
మిడ్ క్యాప్స్లో వేదాంత, అమరరాజా బ్యాటరీస్, డీఎల్ఎఫ్, హెచ్ఓఈసీ నష్టపోయాయి.
టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఎయిర్టెల్, యూపీఎల్, హీరో మోటో కార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐచర్ మోటార్స్ ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HDFC, ఇండస్ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్ర ఉన్నాయి.
నేటి యాక్టివ్ స్టాక్స్లో భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హీరో మోటో కార్ప్ ఉన్నాయి.
టీసీఎస్ స్టాక్ 0.40 శాతం, హెచ్సీఎల్ టెక్ 2.05 శాతం, ఇన్ఫోసిస్ 1.22 శాతం, టెక్ మహీంద్ర స్టాక్ 2.77 శాతం, మైండ్ ట్రీ స్టాక్స్ 4.24 శాతం నష్టపోయాయి. కోఫోర్జ్ స్టాక్స్ 0.28 శాతం, విప్రో స్టాక్స్ 0.28 శాతం మేర లాభపడ్డాయి.