రిలయన్స్ ఎఫెక్ట్: ఆర్బీఐ రెపోరేటు స్థిరంగా ఉంచినా.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఈ వారం ప్రారంభం నుండి భారీ లాభాల్లో కొనసాగిన మార్కెట్లు, వారం చివరలో మాత్రం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈ వారంలో నిన్నటి వరకు 2000 పాయింట్లకు పైగా ఎగిసిపడిన సెన్సెక్స్ నేడు 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆర్థికరంగాల షేర్లపై ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టపోయాయి. దీంతో గత 4 రోజుల లాభాల జోరుకు కళ్లెంపడింది. దీంతో ఆల్ టైమ్ గరిష్ఠాల నుండి సూచీలు వెనక్కి వచ్చాయి. రిలయన్స్లో ఫ్యూచర్ గ్రూప్ విలీనానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు రావడంతో రిలయన్స్ షేర్లు కుప్పకూలాయి. దీనికితోడు కరోనా డెల్టా కేసులు పెరుగుతుండటంతో ఆసియా-పసిఫిక్ సూచీలు అప్రమత్తంగా కదలాడాయి.
కొద్ది రోజుల లాభాల నేపథ్యంలో సూచీలు స్థిరీకరణ దిశగా కనిపించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. చివరకు సెన్సెన్స్ 215 పాయింట్లు నష్టపోయి 54,277 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు కోల్పోయి 16,238 వద్ద ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.74.14 వద్ద ఉంది. గురువారం రూపాయి 74.17 వద్ద క్లోజ్ అయింది. టెల్కో, విద్యుత్, టెక్, ఐటీ రంగాల షేర్లు రాణించాయి. రియాల్టీ, చమురు, మెటల్ రంగాల షేర్లు నష్టపోయాయి. బీఎస్ఈ 30 సూచీలో ఇండస్ఇండ్ బ్యాంకు, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, మారుతీ సుజుకీ, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, టీసీఎస్, హెచ్యూఎల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్, అల్ట్రా టెక్ సిమెంట్, టాటా స్టీల్, హెచ్డీఎప్సీ, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, నేస్లే ఇండియా, ఏషియన్ పేయింట్స్, టైటాన్ షేర్లు నష్టపోయాయి.
సెన్సెక్స్ నేడు 54,492.17 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,633.58 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,210.33 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,304.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,336.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,223.30 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు ఆల్ టైమ్ గరిష్టం నుండి పడిపోయినప్పటికీ 54,275 పాయింట్లకు పైన, నిఫ్టీ 16,230 పాయింట్లకు పైన క్లోజ్ అయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 2 శాతం మేర పతనమైంది. మార్కెట్ లాభాలకు ప్రధానంగా రిలయన్స్ దెబ్బకొట్టింది.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో భారతీ ఎయిర్ టెల్, ఎస్బీఐ, రిలయన్స్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు 3.19 శాతం, అదానీ పోర్ట్స్ 2.47 శాతం, ఐవోసీ 1.88 శాతం, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 1.69 శాతం, భారతీ ఎయిర్ టెల్ 1.54 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో సిప్లా 3.61 శాతం, రిలయన్స్ 2.12 శాతం, శ్రీ సిమెంట్స్ 2.00 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్స్ 1.71 శాతం, ఎస్బీఐ 1.40 శాతం నష్టపోయాయి.
అందుకే రిలయన్స్కు షాక్
గత కొన్ని రోజులుగా రిలయన్స్-అమెజాన్-ప్యూచర్ గ్రూప్ మధ్య జరుగుతోన్న పోరుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్, రిలయన్స్, ఫ్యూచర్ రీటైల్ మధ్య వివాదం నెలకొంది. ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్కు సంబంధించి రూ.24,731 కోట్ల విలువ చేసే ఆస్తులను రిలయన్స్ కొనుగోలు చేయడాన్ని అమెజాన్ తప్పుబట్టింది. దీనిపై కోర్టుకు వెళ్లింది. సుప్రీం కోర్టులో అమెజాన్కు అనుకూలంగా తీర్పు వచ్చింది.