'మహా' ఎఫెక్ట్, దూసుకెళ్లిన రియాల్టీ షేర్లు: 5 నెలల తర్వాత రూపాయి రికార్డ్
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (ఆగస్ట్ 27) లాభాల్లో ముగిశాయి. ఉదయం భారీగా లాభపడిన మార్కెట్లు, మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి కారణంగా ప్రారంభ లాభాలను నిలుపుకోలేక పోయింది. ఉదయం సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభాల్లో కనిపించాయి. చివరకు అమ్మకాల ఒత్తిడి కారణంగా సెన్సెక్స్ 40 పాయింట్లు(0.10%) లాభపడి 39,113.47 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు(0.084) లాభపడి 11,559.25 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.35 శాతం లాభాల్లో ముగిసింది. రంగాలవారగా చూస్తే బీఎస్ఈ ఎనర్జీ ఒక శాతానికి పైగా నష్టపోయింది. ఆయిల్, గ్యాస్, యుటిలిటీస్, టెలికం, ఎఫ్ఎంసీజీ రంగాలు కూడా నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్ఈ రియాల్టీ మాత్రమే భారీ లాభాల్లో క్లోజ్ అయింది.
సెప్టెంబర్ 1 నుండి చెల్లింపులు ఆలస్యమైతే వడ్డీ కట్టాలి
రియాల్టీ జూమ్.. ఎందుకంటే?
నేటి మార్కెట్లో రియాల్టీ రంగం భారీ లాభాల్లో ముగిసింది. రియాల్టీ ఏకంగా 6.63 శాతం లాభపడింది. కరోనా కారణంగా సవాళ్ళు ఎదుర్కొంటున్న రియాల్టీ రంగానికి ఊతమిచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా స్టాంప్ డ్యూటీని 5 శాతం నుండి 2 శాతానికి తగ్గించింది. అలాగే 2021 జనవరి 1 నుండి మార్చి 31 వరకు 3 శాతం స్టాంప్ డ్యూటీని విధిస్తున్నట్లు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో స్టాంప్ డ్యూటీని 4 శాతం నుండి 1 శాతానికి తగ్గించింది. 2021 జనవరి నుండి మార్చి మధ్యలో ఇది 2 శాతంగా ఉండనుంది. దీంతో రియాల్టీ కౌంటర్లకు డిమాండ్ ఏర్పడింది.
రిలయన్స్, ప్రయివేటు బ్యాంకుల ప్రభావం
తొలుత మార్కెట్లు భారీ లాభాల్లోకి వెళ్లినప్పటికీ ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో స్వల్ప లాభాల్లో ముగిశాయి. ప్రధానంగా రిలయన్స్ దాదాపు 1.4 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్ 0.4 శాతం మేర వెనక్కి లాగాయి. ఆటో స్టాక్స్ వరుసగా 5వ రోజు లాభాల్లో ముగిశాయి. పన్ను తగ్గింపు ఆశలతో ఈ స్టాక్స్ లాభాలు చూస్తున్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, గ్రాసీమ్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, రిలయన్స్, కొటక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ ఉన్నాయి.
52 వారాల గరిష్టానికి
దాదాపు 187 షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. ఇందులో ఏపీఎల్ అపోలో, అతుల్, డిక్సాన్ టెక్, టాటా ఎలెక్సీ, జీఎంఆర్ ఇన్ఫ్రా, మ్యాక్స్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి. కొటక్ మహీంద్రా బ్యాంకు, ఇన్ఫోసిస్ కూడా నష్టాల్లో ముగిశాయి.
భారీ లాభాల్లో రూపాయి
డాలర్ మారకంతో రూపాయి ఈ రోజు 49 పైసలు లాభపడి 73.81 వద్ద క్లోజ్ అయింది. మార్చి 11వ తేదీ తర్వాత ఇది రికార్డ్ క్లోజింగ్. 73.80 నుండి 74.36 మధ్య ట్రేడ్ అయింది. చివరకు 73.81 వద్ద క్లోజ్ అయింది. ఏప్రిల్ నెలలో రూపాయి ఆల్ టైమ్ కనిష్టం 76.91 నమోదు చేసింది. ఈ రికార్డ్ నుండి ఈ కాలంలో 3.43 శాతం లాభపడింది. అయితే ఈ ఏడాది ప్రారంభ ధరతో ఇప్పటికీ 4.03 క్షీణతలో ఉంది. ఇక, క్రూడాయిల్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గాయి.