భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు: సెన్సెక్స్ 250 పాయింట్లు జంప్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (మార్చి 10) లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత HDFC, ICICI వంటి ప్రయివేటు దిగ్గజాలతో పాటు రిలయన్స్ వంటి దేశీయ అతిపెద్ద కంపెనీ స్టాక్స్ బలహీనపడటంతో మధ్యాహ్నం కిందకు జారాయి. అయితే కాసేపటికే కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు తిరిగి పరుగు పెట్టాయి.
సెన్సెక్స్ ఓ సమయంలో 51,400 పాయింట్లను క్రాస్ చేసింది. నిన్న అమెరికా సూచీలు లాభాల్లో ముగిశాయి. 1.9 బిలియన్ డాలర్ల కరోనా ప్యాకేజీ ఆమోదం దిశగా పురోగతి, టెక్ షేర్ల దూకుడు అక్కడి మార్కెట్లను ముందుకు నడిపించాయి. బాండ్స్ రాబడులు తగ్గుముఖం పట్టడం కలిసి వచ్చింది. దీంతో అమెరికా మార్కెట్లు, తదనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లు లాభపడ్డాయి. ఈ ప్రభావం ఆసియా, భారత మార్కెట్ పైన కనిపించింది.
సెన్సెక్స్ 254 పాయింట్లు జంప్
నేడు సెన్సెక్స్ 254.03 పాయింట్లు లేదా 0.50% లాభపడి 51,279.51 వద్ద, నిఫ్టీ 76.40 పాయింట్లు లేదా 0.51% ఎగిసి 15,174.80 పాయింట్ల వద్ద ముగిసింది. 1609 షేర్లు లాభాల్లో, 1322 షేర్లు నష్టాల్లో ముగియగా, 170 షేర్లలో ఎలాంటి మార్పులేదు. అమెరికా డాలర్తో రూపాయి మారకం 72.95 వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 72.93 వద్ద ముగిసింది. నేడు ఉదయం 72.96 వద్ద ప్రారంభమైంది. చివరకు 2 పైసలు లాభపడి క్లోజ్ అయింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో JSW స్టీల్ 3.09 శాతం, ఐచర్ మోటార్స్ 3.07 శాతం, టాటా స్టీల్ 2.51 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.40 శాతం, సన్ ఫార్మా 2.19 శాతం లాభపడ్డాయి.
ఎస్బీఐ లైఫ్ ఇన్సురా 3.15 శాతం, ONGC 2.01 శాతం, IOC 1.69 శాతం, HDFC లైఫ్ 1.20 శాతం, గెయిల్ 0.91 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టాటా మోటార్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.
అందుకే జంప్
కరోనా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతుండడం, అగ్రరాజ్యం అమెరికా భారీ ఉద్దీపన ప్యాకేజీ నేపథ్యంలో ప్రపంచ జీడీపీ అంచనాలను ఓఈసీడీ 1.4 శాతం పెంచించింది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 5.6 శాతం మేర పుంజుకునే అవకాశముందని పేర్కొంది. దేశీయంగా లోహ, ఐటీ, టెక్ రంగాల షేర్లు సూచీలకు అండగా నిలిచాయి. ఈ పరిణామాలు నేడు మార్కెట్లపై ప్రభావం చూపాయి.