భారీగా పతనమైన మార్కెట్లు, సెన్సెక్స్ 1300 పాయింట్లు పతనం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (ఏప్రిల్ 19, సోమవారం) ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గతవారం 48,832 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ప్రారంభంలోనే దాదాపు వెయ్యి పాయింట్లు క్షీణించింది. 47,940.81 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఇదే పాయింట్ వద్ద గరిష్టాన్ని తాకి, 47,362.71 కనిష్టాన్ని తాకింది. ప్రారంభ సెషన్ కంటే ఏ సమయంలోను పెరగలేదు. ఓ సమయంలో 100 పాయింట్ల మేర క్షీణించింది. నిఫ్టీ కూడా 14,306.60 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,326.10 వద్ద గరిష్టాన్ని, 14,191.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
డాలర్ మారకంతో రూపాయి విలువ రూ.74.65 వద్ద ట్రేడ్ అయింది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా బీహార్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటించాయి. యూపీ సహా పలు రాష్ట్రాలు వారాంతపు లాక్డౌన్లను ప్రకటించాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
మరోవైపు కరోనా వ్యాక్సిన్లు, రెమ్డెసివిర్ పరిమిత సరఫరా మరింత ఆందోళన కలిగిస్తోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ఉన్నాయి. రోజురోజుకు కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆర్థిక రికవరీ మందగించే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నాయి.