కుప్పకూలిన మార్కెట్లు, సెన్సెక్స్ 840 పాయింట్లు క్రాష్: చైనా బార్డర్ టెన్షన్స్ సహా కారణాలివే..
ముంబై: ఈ రోజు ఉదయం (సోమవారం, ఆగస్ట్ 31) లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత భారీ నష్టాల్లో ముగిశాయి. నేడు మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ 40వేల మార్క్ను అందుకుంది. అయితే ఈ ఆనందం ఇన్వెస్టర్లకు ఎంతోసేపు నిలువలేదు. అంతర్జాతీయ సానుకూల పరిణామాలు, దేశీయంగా లాక్ డౌన్ సడలింపులు వంటి కారణాలతో ఓ దశలో సెన్సెక్స్ 40,010 చేరుకుంది. అయితే ఆ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా భారీ నష్టాలను చవిచూసింది. డ్రాగన్ కుట్రలను భారత్ తిప్పికొట్టింది. అయినప్పటికీ మార్కెట్ పైన ఆ ప్రభావం పడింది.
Sovereign gold bond: మార్కెట్ ధర కంటే తక్కువకే బంగారం! అలా కొంటే రూ.500 డిస్కౌంట్
సెన్సెక్స్ 840 పాయింట్లు డౌన్
సెన్సెక్స్ 839.02 పాయింట్లు (2.13 శాతం) నష్టపోయి 38,628.29 వద్ద ముగిసింది. నిఫ్టీ 284.40 పాయింట్లు (2.44 శాతం) నష్టపోయి 11,363.20 వద్ద క్లోజ్ అయింది. సన్ ఫార్మా, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి.
భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్ మోస్ట్ యాక్టివ్ స్టాక్స్గా నిలిచాయి. రంగాల వారీగా చూస్తే మెటల్స్, ఫార్మా, పీఎస్యూ బ్యాంకు ఇండెక్స్ 4 శాతం మేర నష్టపోగా, మిడ్ క్యాప్ 3 శాతం నష్టపోయాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ఓఎన్జీసీ, టీసీఎస్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో సన్ ఫార్మా, ఎస్బీఐ, ఐచర్ మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంకు ఉన్నాయి.
ఓ దశలో 1000 పాయింట్లకు పైగా డౌన్
సెన్సెక్స్ ఓ దశలో ఏకంగా 1,035 పాయింట్లకు పైగా కుప్పకూలింది. నిఫ్టీ దాదాపు 300 పాయింట్లకు పైగా నష్టంతో 11,500 దిగువకు చేరుకుంది. దాదాపు అన్నిరంగాలు నష్టపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫార్మా, ఆటో, ఐటీ, మెటల్ రంగాలు భారీగా నష్టపోయాయి.
మార్కెట్ నష్టానికి కారణాలు
అంతర్జాతీయ సానుకూల పరిణామాలు, దేశీయంగా లాక్ డౌన్ సడలింపులు వంటి కారణాలతో దేశీయ మార్కెట్లు ఉదయం లాభపడ్డాయి. కానీ పాంగాంగ్ సో సరస్సు వద్ద చైనా తన సైనిక కార్యకలాపాలు ప్రారంభించడం, దానిని భారత్ తిప్పికొట్టినట్లు వార్తలు రావడంతో మార్కెట్ల పతనం ప్రారంభమైంది. దీనికి తోడు సాయంత్రం జీడీపీ ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. జీడీపీ వృద్ధి రేటు దశాబ్ద గరిష్టానికి పడిపోతుందని అంచనాలు వచ్చాయి. జీ20 దేశాల్లో అత్యల్ప వృద్ధి రేటు భారత్లోనే నమోదు కానుందని అంచనాలు వచ్చాయి. చైనా దుందుడుకు చర్యలు, జీడీపీ వృద్ధి రేటు, జీ20 దేశాల్లో అత్యల్ప వృద్ధి రేటు, ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ వంటి వివిధ కారణాలతో మార్కెట్లు పతనమయ్యాయి.