882 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, రూ.3.5 లక్షల కోట్లు హుష్కాకి
ముంబై: ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, ఆద్యంతం నష్టాల్లోనే ఉన్నాయి. చివరకు అతికొద్దిగా కోలుకున్నప్పటికీ దాదాపు 900 పాయింట్ల నష్టాల్లో ముగిసింది సెన్సెక్స్. దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ బలంగా విజృంభిస్తోంది. కరోనా ఉద్ధృతి, కరోనా సంబంధిత ఆంక్షలు, లాక్డౌన్ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. కేసుల ఉద్ధృతితో అప్రమత్తమవుతోన్న రాష్ట్రాలు కఠిన ఆంక్షల వైపు దృష్టి సారించాయి. అనేక రాష్ట్రాలు ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటించాయి. వారాంతపు లాక్డౌన్ విధించాయి. ఢిల్లీలో 6 రోజుల లాక్డౌన్ విధించారు.
భారీగా పతనం
సెన్సెక్స్ ఉదయం 47,940.81 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,020.79 వద్ద గరిష్టాన్ని, 47,362.71 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 882.61 (1.81%) పాయింట్లు నష్టపోయి 47,949.42 పాయింట్ల వద్ద ముగిసింది. ఏకంగా 48,000 దిగువన క్లోజ్ అయింది. సెన్సెక్స్ ఓ సమయంలో 1500 పాయింట్ల మేర పడిపోయింది. నిఫ్టీ 14,306.60 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,382.30 వద్ద గరిష్టాన్ని, 14,191.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 258.40 (1.77%) పాయింట్లు నష్టపోయి 14,359.45 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మోస్ట్ టాప్ గెయినర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.53 శాతం, బ్రిటానియా 1.25 శాతం, సిప్లా 0.88 శాతం, విప్రో 0.76 శాతం, ఇన్ఫోసిస్ 0.65 శాతం లాభపడ్డాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 4.57 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 4.12 శాతం, ఓఎన్జీసీ 3.96 శాతం, హీరో మోటోకార్ప్ 3.78 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 3.61 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో విప్రో, టాటా మోటార్స్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ ఉన్నాయి.
నేడు ఉదయం ప్రారంభ సెషన్లో ఇన్వెస్టర్లు రూ.5 లక్షల కోట్లు నష్టపోయారు. అయితే సాయంత్రానికి భారీ నష్టాలు కాస్త తగ్గి 1400 పాయింట్ల నుండి 880 పాయింట్లకు తగ్గడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.3.5 లక్షల కోట్లు క్షీణించింది.
నిర్మలమ్మ మాట.. రేపు లాభాల్లోకి వచ్చేనా
రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆర్థిక రికవరీ మందగించే అవకాశముందని ఆర్థిక నిపుణులు, బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించాయి. స్థానికంగా విధిస్తున్న లాక్డౌన్ల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడి, రికవరీ నెమ్మదిస్తుందని, అందుకే జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్లు తెలిపాయి. ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి. అయితే నేడు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి లాక్ డౌన్ ఉండదని స్పష్టం చేసినందున రేపు మార్కెట్లు లాభాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి.