రెండు గంటల్లో రూ. లక్ష కోట్లను నష్టపోయిన ఎల్ఐసీ: పాతాళానికి షేర్ల ధరలు
ముంబై: జీవిత బీమా సంస్థ షేర్ల ధరల పతనం కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్స్లో ఇవ్వాళ మరింత దిగజారాయి ఎల్ఐసీ షేర్ల ధరలు. 800 రూపాయల కంటే దిగువకు పడిపోయాయి. దీని ఫలితం- ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్పై తీవ్రంగా పడింది. ఎల్ఐసీ స్టాక్స్పై అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా కనిపించింది. రిటైల్ ఇన్వెస్టర్లు- తక్కువ నష్టంతోనైనా షేర్లను విక్రయించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించింది.
ఎల్ఐసీ ఐపీఓ లాంచింగ్కు ముందు.. ఆ తరువాత మంచి బజ్ లభించింది గానీ- దాన్ని కాపాడుకోలేకపోయింది. స్టాక్ మార్కెట్స్లో వరస్ట్ పెర్ఫార్మ్గా చేసింది. మైనస్లో లిస్ట్ అయింది. ఇన్వెస్టర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. 21,000 కోట్ల రూపాయలను సమీకరించడానికి జారీ అయిన పబ్లిక్ ఇష్యూ ఇది. దీని ప్రైస్ బ్యాండ్ రూ.902-949 రూపాయలు కాగా 10 శాతం నష్టంతో బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయింది.
శుక్రవారం స్టాక్ మార్కెట్లో రూ.800.45 పైసల వద్ద ఎల్ఐసీ ట్రేడింగ్ ముగియగా.. ఇవ్వాళ- ఈ ధర మరింత పడిపోయింది. రూ.784.25 పైసల వద్ద ట్రేడ్ అవుతోంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే 15 రూపాయల మేర నష్టాన్ని పంచింది ఇన్వెస్టర్లకు. దీని ఫలితం అటు ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మీద కూడా పడింది. తొలి రెండుగంటల వ్యవధిలోనే లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ను కోల్పోయింది ఎల్ఐసీ.
శుక్రవారం నాడు ఎల్ఐసీ మార్కెట్ క్యాప్.. 6,00,242 కోట్ల రూపాయలు. కాగా ఇవ్వాళ తొలి రెండు గంటల్లోనే ఈ సంఖ్య అయిదు లక్షల దిగువకు పడిపోయింది. 4,97,334 కోట్ల రూపాయలు చేరింది. 15 ట్రేడింగ్ సెషన్లల్లో ఎల్ఐసీ ఇన్వెస్టర్లు మొత్తంగా 1,02,908 కోట్ల రూపాయలను నష్టపోయినట్టయింది. రూ.784.25 పైసలు అనేది లోయెస్ట్ ట్రేడింగ్ ప్రైస్. ఒక్కో షేర్ మీద 165 రూపాయల నష్టం వచ్చింది. దీని ట్రేడింగ్ గ్రాఫ్ ఇంకా నేల చూపులు చూస్తూ వస్తోందే తప్ప పైకి ఎగబాకట్లేదు.
కాగా- ఎల్ఐసీ షేర్లను హోల్డ్ చేసి ఉంచొచ్చంటూ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎల్ఐసీ షేర్ల టార్గెట్ ప్రైస్ 875 రూపాయలుగా నిర్ధారించారు. భవిష్యత్లో షేర్ల ధర క్రమంగా పెరుగుతుందని అంచనా వేస్తోన్నారు. కటాఫ్ ప్రైస్ను అందుకోవడం ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చనీ ఎంకే గ్లోబల్ అంచనా వేసింది. ఎల్ఐసీ ఇన్వెస్టర్లు ఇప్పట్లో లాభాలను చవి చూడబోరని, నష్టాన్ని కొంత మేర పూడ్చుకోవడానికి అవకాశం ఉందని వ్యాఖ్యానించింది.