కొంతమందికి ప్రోత్సాహం, CCI దర్యాఫ్తు: ఫ్లిప్కార్ట్, అమెజాన్లకు సుప్రీం కోర్టులో షాక్
ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్లకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమ అంతర్గత వ్యాపార విధానాలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) దర్యాఫ్తును నిలిపివేయాలని ఈ దిగ్గజాలు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి. అయితే వీటిని కోర్టు తోసిపుచ్చింది. విచారణకు హాజరయ్యేందుకు నాలుగు వారాల సమయం కేటాయించింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు మార్కెట్ పోటీతత్వ చట్టాలను ఉల్లంఘిస్తూ కొంతమంది విక్రేతలను మాత్రమే ప్రోత్సహిస్తున్నట్లు భారత్లోని వ్యాపార సంస్థలు ఆరోపణలు చేశాయి. దీనిని CCI పరిగణలోకి తీసుకుంది.
గత ఏడాది జనవరి నెలలో ఈ సంస్థలపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆరోపణలను అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు కొట్టిపారేశాయి. CCI ఎలాంటి రుజువు లేకుండా దర్యాప్తు చేపట్టిందని ఆరోపించడంతో పాటు ఈ మేరకు కర్ణాటక హైకోర్టు మెట్లు ఎక్కాయి. అయితే అక్కడ ఈ ఈ-కామర్స్ దిగ్గజాలకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ-కామర్స్ సంస్థల పిటిషన్లకు విచారణయోగ్యత లేదని జులై 23వ తేదీన కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. వీటి వ్యాపార విధానాలపై విచారణ జరపాలని తేల్చి చెప్పింది. కర్ణాటక హైకోర్టు తీర్పును ఈ సంస్థలు సుప్రీం కోర్టులో సవాల్ చేశాయి. ఇక్కడ కూడా వాటికి షాక్ తగిలింది.
CCi విచారణను నిలిపివేయాలన్న సంస్థల విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి పెద్ద సంస్థలు దర్యాప్తు, పారదర్శకత వంటి అంశాల్లో స్వచ్ఛందంగా వ్యవహరించాలని, ఇలాంటి విచారణలకు ముందుకు రావాలని, కానీ దర్యాప్తు జరగకూడదని అనుకుంటున్నారని, ఈ వ్యవహారంలో విచారణ జరగాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నివేదికలు సమర్పించాలని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. 4 వారాల్లోగా విచారణకు హాజరవ్వాలని తెలిపింది.