ముంబై: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)కు చెందిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ విఫలం కావడంతో పలువురు కస్టమర్లు అసహనానికి గురయ్యారు. యోనో యాప్ కస్టమర్లకు చిరాకు తెప్పించింది. కస్టమర్లకు ఎస్బీఐ యోనో యాప్ ఎర్రర్ చూపించింది. తమకు ఎర్రర్ వచ్చిందని, లాగిన్ అవలేకపోతున్నామని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కస్టమర్లు మంగళవారం నుండే యోనో యాప్ పైన ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. బుధవారం కూడా కొనసాగింది.

నాలుగైదుసార్లు ప్రయత్నించినా..
నాలుగైదు మార్లు ప్రయత్నించినప్పటికీ తాము ఆన్ లైన్ ద్వారా డబ్బులు పంపించలేకపోతున్నామని నోయిడాకు చెందిన ఎస్బీఐ కస్టమర్ ఒకరు పేర్కొన్నారు. ఎస్బీఐ బ్యాంకు కస్టమర్లకు డబ్బులు పంపించడం కోసం ఇతర బ్యాంకుల సేవలను ఉపయోగిస్తున్న కస్టమర్లు కూడా సమస్యను ఎదుర్కొన్నారు. ఇతర బ్యాంకుల నుండి ఎస్బీఐ కస్టమర్ అకౌంట్కు డబ్బులు పంపించినా ఇబ్బందులు ఎదురయ్యాయి. బ్యాంకు తమ ఆన్ లైన్ సేవల్లో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటుందా స్పష్టం చేయాల్సి ఉంది.

ఎర్రర్ కోడ్ ఎం005
తాము ఎస్బీఐ యోనో యాప్ను ఉపయోగించినప్పుడు ఎర్రర్ కోడ్ ఎం005 చూపిస్తోందని, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ ఇబ్బందిని కలిగిస్తున్నాయని పలువురు కస్టమర్లు తెలిపారు. నేను ఇప్పటి వరకు ఎదుర్కొన్న అత్యంత చెత్త బ్యాంకింగ్ యాప్.. ఎస్బీఐ యోనో అని ఓ ట్విట్టర్ యూజర్ అసహనం వెళ్లగక్కారు. యాప్లోని సమస్యలను ఎస్బీఐ ఎందుకు పరిష్కరించడం లేదని కూడా ఆ ట్వీట్లో ప్రశ్నించారు.

ఇదివరకు సమస్య
కొద్ది వారాల క్రితం, నవంబర్ 22వ తేదీన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో టెక్నికల్ సమస్యలు వచ్చాయి. అసౌకర్యానికి చింతిస్తున్నామని, మా సర్వర్లో అప్పుడప్పుడు కనెక్టివిటీ సమస్య ఎదురవుతోందని, తమ బృందం సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తోందని, ప్రస్తుతం ఇతర డిజిటల్ ఛానల్స్ ఉపయోగించాలని ఎస్బీఐ తన ప్రకటనలో తెలిపింది.


Click it and Unblock the Notifications