డిసెంబర్ 31వ తర్వాత ఈ డెబిట్ కార్డులు బ్లాక్ అవుతాయి, మార్చుకోండి
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మ్యాగ్స్ట్రిప్ (మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డు) కలిగిన కార్డులను డిసెంబర్ 31వ తేదీ నుంచి బ్లాక్ చేయనుంది. వాటి స్థానంలో కొత్తగా ఈవీఎం చిప్ అండ్ పిన్ బేస్డ్ డెబిట్ కార్డులను తీసుకోవాలని తన కస్టమర్లకు సూచించింది. ఈ నెల 31వ తేదీ లోపు మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డులను ఎలాంటి ఛార్జీ లేకుండా మార్చుకునే వెసులుబాటు ఎస్బీఐ కల్పించింది.
మాంద్యం దెబ్బ,మోడీ ప్రభుత్వం ప్లాన్:PFపై ఉద్యోగులకు శుభవార్త
ప్రస్తుతం మ్యాగ్స్ట్రిప్ కార్డు ఉన్న కస్టమర్లు కొత్త తరహా కార్డుల కోసం ఎస్బీఐ హోమ్ బ్రాంచీల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పేర్కొంది. మోసపూరిత ట్రాన్సాక్షన్స్ నుంచి కస్టమర్లను రక్షించేందుకు ఆర్బీఐ ఇటీవల కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిలో భాగంగా మ్యాగ్స్ట్రిప్ డెబిట్ కార్డులు ఉన్న కస్టమర్లు వాటి స్థానంలో ఈవీఎం (యూరోపే, మాస్టర్ కార్డు, వీసా) చిప్ డెబిట్ కార్డులు తీసుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఆయా బ్యాంకులు ఈ సేవలను పూర్తిగా అందించాలని, ఈ ఏడాది చివరలోగా ప్రతి ఒక్కరూ చిప్ ఆధారిత కార్డులు తీసుకోవాలని ఆర్బీఐ పేర్కొంది.
ఈ చిప్ ఆధారిత కార్డులను ఆర్బీఐ 2016 నుంచి తప్పనిసరి చేసింది. 2016 జనవరి 31వ తేదీ తర్వాత బ్యాంకు ఖాతాలు తెరిచిన కస్టమర్లు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే చిప్ ఆధారిత కార్డులే జారీ చేయాలని ఆర్బీఐ సూచించింది. అలాగే అంతకుముందు నుంచి ఉన్న కార్డులను కూడా తప్పనిసరిగా మార్చాలని ఆర్బీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ తమ కస్టమర్లకు సమాచారం అందించింది.