అలా రుణం తీసుకున్న వారికి షాక్, బేస్ రేటు పెంచిన SBI
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తన బేస్, ప్రైమ్ లెండింగ్ రేట్లను స్వల్పంగా పెంచింది. ఈ రెండు వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించింది. ఈ మేరకు బుధవారం ప్రకటించింది. ఇవి మార్చి 10 (బుధవారం) నుండే అమల్లోకి వచ్చినట్లు ఎస్బీఐ తెలిపింది. దీంతో బేస్ రేటు 7.40 శాతం, ప్రైమ్ లెండింగ్ రేటు 12.15 శాతానికి చేరింది.
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెడింగ్ రేటు (MCLR)కు ఎలాంటి సవరణ చేయలేదు. ఇది రుణ వ్యవధులను బట్టి 6.65 శాతం నుండి 7.30 శాతం మధ్యలో ఉంది. ఏప్రిల్ 2016 నుండి బేస్ రేటు స్థానంలో MCLR అమలులోకి వచ్చింది. అంతకుముందు హోమ్ లోన్ వంటి రుణాలు తీసుకున్నవారు చాలామంది ఈ కొత్త వడ్డీ విధానంలోకి మారారు. ఇలా మారేందుకు రుణగ్రహీతలు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుని, నిర్ణీత ఛార్జీ చెల్లించాలి.
ఇంకా మారని వారికి మాత్రం ప్రస్తుత బేస్, ప్రైమ్ లెండింగ్ రేట్ల వడ్డీ పెంపు భారం పడనుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు ప్రతి నెలా నిధుల సమీకరణ భారాన్ని లెక్కించి, రుణ వడ్డీలను నిర్ణయించాలి. ఇటీవల బ్యాంకులు వడ్డీ రేట్లను వరుసగా తగ్గిస్తోన్న విషయం తెలిసిందే.