ఎస్బీఐ కార్డు ఫుల్ జోష్... ఐపీవో కంటే ముందే రూ 2,769 కోట్లు!
ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ సంస్థ ఐన ఎస్బీఐ కార్డు ఫుల్ జోష్ లో ఉంది. ఈ సంస్థ త్వరలోనే ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) కు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఐపీవో ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అనుబంధ సంస్థ కావటంతో పాటు... కొన్నేళ్లుగా క్రెడిట్ కార్డుల జారీలో ఎస్బీఐ కార్డు చాలా ముందుంది. దేశంలో డిజిటల్ పేమెంట్లు, డిజిటల్ లావాదేవీలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఎస్బీఐ కార్డు ఐపీవో అందరినీ ఊరిస్తోంది.
ప్రస్తుతం చైనాలో మొదలైన కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లతో పాటు ఇండియన్ స్టాక్ మార్కెట్లు కుదేలు అయినప్పటికీ ఎస్బీఐ కార్డు పై ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గటం లేదు. పైగా ఐపీవో కంటే ముందే కొంత మంది యాంకర్ ఇన్వెస్టర్లు రూ వేల కోట్ల నిధులు కుమ్మరించటం విశేషం. ఈ ఇన్వెస్టర్లలో అటు విదేశీ కంపెనీల నుంచి ఇటు దేశీయ మ్యూచువల్ ఫండ్ దిగ్గజాలు కూడా ఇండటం మరో విశేషం. ఈ స్పీడ్ చూస్తుంటే స్టాక్ మార్కెట్లను మళ్ళీ రివైవ్ చేయగలిగే సత్తా ఎస్బీఐ కి ఉందని మార్కెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
ఒక్కో షేరు రూ 755 ...
ఎస్బీఐ కార్డు ఐపీవో ప్రైస్ బ్యాండ్ ను ఇప్పటికే రూ 750 - రూ 755 గా నిర్ణయించారు. రిటైల్ ఇన్వెస్టర్ల కు 19 షేర్ల తో కూడిన ఒక లాట్ ను కేటాయించనున్నారు. అయితే, ఏ ఐపీవో లో అయినా సరే కనీసం 25% నుంచి గరిష్టంగా 75% వరకు వాటాలను యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎస్బీఐ కార్డు ఐపీవో లో భాగంగా ఒక్కో షేరును రూ 755 చొప్పున 74 మంది యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. దీంతో ఎస్బీఐకి ఇప్పటికే రూ 2,769 కోట్ల మేరకు నిధులు సమకూరాయి. ఇందులో 12 మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ మేరకు ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనం ప్రచురించింది.
దిగ్గజ సంస్థలు...
ప్రస్తుతం ఎస్బీఐ లో యాంకర్ ఇన్వెస్టర్లుగా వచ్చిన కంపెనీలు దిగ్గజ సంస్థలు కావటం విశేషం. ఇందులో సింగపూర్ ప్రభుత్వం, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్, హెచ్ డీ ఎఫ్ సి మ్యూచువల్ ఫండ్, గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్, బిర్లా మ్యూచువల్ ఫండ్ వంటి కంపెనీలు ఉన్నాయి. వీటికి మొత్తంగా 3,66,69,589 ఈక్విటీ షేర్లను కేటాయించారు. మార్చి 2 నుంచి ఐపీవో ప్రారంభం కానుంది. మార్చి 5 న ఐపీవో ముగియనుంది. కాగా, ప్రస్తుతం ఎస్బీఐ కార్డులో 76% వాటా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కు ఉండగా... మిగితాది ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఐన కార్లైల్ గ్రూప్ వద్ద ఉంది. ఈ ఐపీవో ద్వారా కార్లైల్ గ్రూప్ మెజారిటీ వాటాను విక్రయించి కంపెనీ నుంచి ఎగ్జిట్ అవ్వాలని భావిస్తున్నట్లు అనలిస్టుల అంచనా.
రూ 9,000 కోట్ల అంచనా...
ప్రస్తుత ఐపీవో ద్వారా ఎస్బీఐ కార్డు... సుమారు రూ 9,000 కోట్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మొత్తంగా 13,05,26,798 ఈక్విటీ షేర్లను జారీ చేస్తోంది. ఇందులో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 3,72,93,371 ఈక్విటీ షేర్లను విక్రయిస్తుండగా... కార్లైల్ గ్రూప్ 9,32,33,427 ఈక్విటీ షేర్లను ఇన్వెస్టర్లకు విక్రయించేందుకు సిద్ధమైంది. మరో రూ 500 కోట్ల విలువైన ఫ్రెష్ ఈక్విటీ కూడా ఇన్వెస్టర్లకు ఆఫర్ చేసేందుకు ఎస్బీఐ కార్డుకు అవకాశం ఉంటుంది. ఈ ఐపీవో లో పాల్గొనాలనుకునే రిటైల్ ఇన్వెస్టర్లు మార్చి 2 నుంచి మార్చి 5 లోపు తమ తమ బిడ్డింగులను సమర్పించాల్సి ఉంటుందనే నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ కార్డుల వినియోగం పెరుగున్నందున, భవిష్యత్ లో ఎస్బీఐ కార్డు మెరుగైన రాబడులను అందించగలదని వారు అభిప్రాయపడుతున్నారు.