ఎస్బీఐ ఐపీవో... రూ 10,000 కోట్లు అడిగితే... రూ 2,00,000 కోట్లు!
ఎస్బీఐ కార్డ్స్ ఐపీవో ప్రస్తుతం ఇండియాలో ఒక పెద్ద సంచలనం. కరోనా వైరస్, ఆర్థిక మందగమనం అంశాలతో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నా... ఎస్బీఐ కార్డ్స్ ఐపీవో కు మాత్రం ఆదరణ అంతకంతకూ పెరిగిపోతోంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ సంస్థ అయిన ఎస్బీఐ కార్డ్స్ పై ఇండియన్ ఇన్వెస్టర్లలో విశ్వాసం అధిక పాళ్ళలో కనిపిస్తోంది. దీంతో రికార్డు స్థాయిలో కంపెనీ ఐపీవో 26 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయింది. అంటే... బ్యాంకు ఈ ఐపీవో ద్వారా సుమారు రూ 10,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇన్వెస్టర్లు మాత్రం రూ 2,00,000 కోట్ల విలువైన బిడ్స్ దాఖలు చేశారు. అంటే ప్రతి ఒక్క షేరుకు 26 బిడ్లు దాఖలు అయ్యాయి.
ఈ మేరకు బిజినెస్ స్టాండర్డ్ ఒక కథనాన్ని ప్రచురించింది. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ఇన్వెస్టర్ల విశ్వాసం చూరగొన్న మరో కంపెనీ లేదంటే అతిశయోక్తి కాదు. స్టాక్ మార్కెట్లు బుల్లిష్ గా ఉన్నప్పుడు ఏ కంపెనీ అయినా తాను అనుకున్న మొత్తంలో నిధులను సమీకరించగలుగుతుంది. కానీ, ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్న సందర్భంలోనూ ఈ స్థాయిలో ఆదరణ లభించటం మాత్రం ఇదే తొలిసారి.
సంపన్నుల పోటీ...
కేవలం సామాన్య రిటైల్ ఇన్వెస్టర్ల నుంచే కాకుండా... సంపన్నుల మధ్య ఎస్బీఐ కార్డ్స్ ఐపీవో కు విపరీతమైన పోటీ నెలకొంది. హై నెట్ వర్త్ ఇండివిడ్యుల్స్ (హెచ్ ఎన్ ఐ), క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ (క్యూఐబీ) కేటగిరీ లో పోటీ తీవ్రముగా ఉంది. ఒక్క హెచ్ ఎన్ ఐ ఇన్వెస్టర్లే 44 రెట్ల బిడ్లు దాఖలు చేశారు. వీటి విలువ రూ 60,000 కోట్లుగా ఉంది. ఇక క్యూఐబీ ఇన్వెస్టర్లు అయితే మరీ అధికంగా 55 రెట్ల బిడ్స్ దాఖలు చేశారు. వీరి బిడ్ల మొత్తం విలువ ఏకంగా రూ 1,04,583 కోట్లు కావటం విశేషం. ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ ఐపీవో కైనా ఇదే అత్యధిక బీడ్ అమౌంట్ అని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మెరుగైన లాభాలు, వృద్ధికి అపారమైన అవకాశాలు ఉండటంతో ఇన్వెస్టర్ల నుంచి ఎస్బీఐ కార్డ్స్ కు ఆదరణ అధికంగా లభిస్తోంది.
రిటైల్ వాటా తక్కువే...
ప్రస్తుత ఎస్బీఐ కార్డ్స్ ఐపీవో లో రిటైల్ ఇన్వెస్టర్ల మధ్య పోటీ ఉన్నా... అది మొత్తం పోటీతో పోల్చితే తక్కువగానే ఉంది. ఈ ఐపీవో కోసం రిటైల్ ఇన్వెస్టర్లు 2.5 రెట్ల మేరకు బిడ్స్ దాఖలు చేశారు. అంటే ఒక్కో షేరు కోసం 2.5 బిడ్స్ దాఖలు అయినట్లు. వీటి విలువ రూ 8,000 కోట్లుగా ఉంది. ఇక కంపెనీ ఉద్యోగుల నుంచి 4.7 రెట్ల బిడ్స్ దాఖలు అయ్యాయి. వారు రూ 600 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. చివరగా కంపెనీ వాటాదారులు 25 రెట్ల బిడ్స్ దాఖలు చేశారు. వీరంతా కలిసి రూ 24,716 కోట్ల విలువైన బిడ్స్ దాఖలు చేశారు.
ఒక్కో షేరు రూ 755...
మార్చి 2 నుంచి మార్చి 5 వరకు ఆఫర్ చేసిన ఐపీవో ద్వారా ఎస్బీఐ కార్డ్స్... ఇప్పటికే రూ 10,340 కోట్ల నిధులను సమీకరించింది. ఇందులో భాగంగా సుమారు 13 కోట్లకు పైగా షేర్లను విక్రయిస్తున్నారు. ఒక్కో షేరు ధర రూ 755 గా నిర్ణయించారు. ఎస్బీఐ కార్డ్స్ లో మెజారిటీ వాటా (74%) దాని పేరెంట్ కంపెనీ ఐన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వద్ద ఉండగా... కార్లైల్ అనే అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వద్ద మిగిలిన వాటా ఉంది. ప్రస్తుతం ఐపీవో ద్వారా ఎస్బీఐ, కార్లైల్ సంస్థలు తమ వాటాల్లో నుంచి కొంత భాగం విక్రయిస్తున్నాయి. ఐపీవో అనంతరం ఎస్బీఐ కార్డ్స్ మార్కెట్ క్యాపిటలిజషన్ సుమారు రూ 71,000 కోట్లు ఉంటుందని మార్కెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. తద్వారా దేశంలోనే 38వ విలువైల కంపెనీగా అది ఆవిర్భవించనుంది.