ఎస్బీఐ కస్టమర్ కేర్ ఫ్రాడ్: ఖాతాదారులకు హెచ్చరిక
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్లకు హెచ్చరిక జారీ చేసింది. ఎస్బీఐ పేరుతో ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ రోజుల్లో మనకు ఏ సమాచారం కావాలన్నా గూగుల్ చేయడం సాధారణమైంది. చివరకు సంస్థలు, ఆసుపత్రులు, బ్యాంకుల కస్టమర్ కేర్ నెంబర్ కోసం కూడా ఆయా అధికారిక వెబ్ సైట్లకు వెళ్లకుండా గూగుల్లో వెతుకుతున్నామని, అయితే మిగతా వాటి సంగతి పక్కన పెడితే బ్యాంకింగ్ విషయంలో అలా చేయడం తప్పని చెబుతోంది ఎస్బీఐ. తప్పుడు కస్టమర్ కేర్ నెంబర్లతో మోసాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
మోసపూరిత కస్టమర్ కేర్ సెంటర్ల వలలో పడి ఖాతాకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను షేర్ చేయవద్దని, అలా షేర్ చేస్తే ఖాతాలో డబ్బు పోయే ప్రమాదం ఉందని ఎస్బీఐ తెలిపింది. దీనిపై అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
మోసపూరిత కస్టమర్ కేర్ నెంబర్లతో జాగ్రత్త, సరైన కస్టమర్ కేర్ నెంబర్ కోసం దయచేసి ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ను మాత్రమే సంప్రదించండని, బ్యాంకింగ్కు సంబంధించి రహస్య వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని ఖాతాదారులను హెచ్చరించింది. నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లకు సంబంధించి ఎస్బీఐ సహా పలు బ్యాంకులు తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు గతంలోను ఇలాంటి హెచ్చరికలు జారీ చేశాయి.