సంచలనానికి సౌదీ అరాంకో రెడీ... నేడే ముహూర్తం!
సౌదీ అరేబియాకు చెందిన సౌదీ అరాంకో సంచలనం సృష్టించబోతోంది. ఈ కంపెనీ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రాబోతోంది. ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యుకు సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. అయితే దీని గురించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. సాధారణంగా అనేక కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చి కంపెనీలో వాటాను విక్రయించి నిధులను సమీకరించడం సహజమే. కానీ సౌదీ ఇంధన పరిశ్రమ చరిత్రలో ఒక పెద్ద కంపెనీలో వాటాలను ప్రయివేట్ వ్యక్తులకు విక్రయించడమే ఇక్కడ చెప్పుకోదగిన విషయం. ఈ కంపెనీని 1970 సంవత్సరంలో జాతీయీకరణ చేశారు. అప్పటి నుంచి ఇలాంటి భారీ మార్పు ఇంతవరకు జరగలేదు. ప్రపంచ చమురు సరఫరాలో ఈ కంపెనీ వాటా 10 శాతం ఉండటం మాములు విషయమేమీ కాదు.
ఇదీ చరిత్ర...
* ప్రపంచవ్యాప్తంగా చూస్తే అత్యంత లాభదాయక కంపెనీ ఇది.
* ఈ కంపెనీ విలువ సుమారుగా 1.5 లక్షల కోట్ల డాలర్లు ఉండదని అంచనా.
* సౌదీ అరేబియా ఆర్ధిక, సామాజిక స్థిరత్వానికి ఈ కంపెనీయే వెన్నెముక
* మూడేళ్ల క్రితమే ఈ కంపెనీని పబ్లిక్ ఇష్యుకు తీసుకువెళ్లాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే వివిధ రకాల కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది.
అమ్మకం అనివార్యం...
* 2030 నాటికీ సౌదీ ఆర్ధిక వ్యవస్థలో అనేక రకాల మార్పులు చేర్పులు తీసుకురావాలన్నది
రాజు మొహమ్మద్ ప్రణాళిక.
* ఈ నేపథ్యంలో అరాంకోలో వాటాను విక్రయించడం అనివార్యంగా ఉంది.
* ఈ దేశం ముఖ్యంగా చమురు ఎగుమతులపైనే ఆధారపడి ఉంది. కానీ ఈ పరిస్థితిని మార్చాలన్నది రాజు ఉద్దేశం.
* పబ్లిక్ ఇష్యు ద్వారా వచ్చే సొమ్ముతో ప్రభుత్వ ఖజానా భారీ స్థాయిలో పెరగనుంది.
* ఈ ఏడాది చివరి నాటికీ కంపెనీని లిస్ట్ చేయాలని భావిస్తున్నారని సమాచారం.
* అరాంకో షేర్ ను మరింత ఆకర్షణీయం చేయడానికి గాను వచ్చే ఏడాదిలో 7,500 కోట్ల డాలర్ల డివిడెండ్ ను ఇవ్వాలని కంపెనీ భావిస్తోందట.
* కంపెనీ మార్కెట్ విలువ 2 లక్షల కోట్ల డాలర్లకు చేరితే ఇన్వెస్టర్లకు 3.75 శాతం రిటర్న్ లభించనుంది.
* పరిమిత కాలానికి డివిడెండ్ల విషయంలోనూ ఇన్వెస్టర్లకు హామీని ఇస్తున్నారు.
* తొలుత దేశీయ స్టాక్ మార్కెట్లోనే షేర్లను లిస్ట్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత విదేశీ మార్కెట్లపై ద్రుష్టి సారించనున్నట్టు సమాచారం.
* కంపెనీలో 5 శాతం షేర్లను విక్రయిచాలని భావిస్తున్నారట. ఆదివారంనాడు అన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
అనేక సంస్కరణలు..
గల్ఫ్ దేశయాల్లో కీలకంగా ఉన్న సౌదీ అరేబియా ముడిచమురు ధరలు తగ్గిన ఫలితంగా అనేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కేవలం చమురుపై ఆధారపడితే సరిపోదని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఆదాయాన్ని పెంచేందుకు అవకాశం ఉన్న రంగాలను ఎంచుకుంది. ప్రజలకు కూడా మరింత స్వేచ్ఛను ఇచ్చింది. స్థానికులకు ఉపాధి అవకాశాలను పెంచింది. కొన్ని రకాల ప్రభుత్వ సబ్సిడీలను తగ్గించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాలన్న ధోరణితో వ్యవహరిస్తోంది.