ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో.. రూ.1.8 లక్షల కోట్లు సేకరించిన సౌదీ ఆరామ్కో
సౌదీ అరేబియాకు చెందిన చమురు రంగ దిగ్గజం ఆరామ్కో ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా అవతరించింది. అంతేకాదు, టెక్ దిగ్గజాలైన యాపిల్, మైక్రోసాఫ్ట్, అలీబాబా వంటి దిగ్గజ సంస్థలను సైతం వెనక్కి నెట్టేసి మరీ దూసుకెళుతోంది. దీనికి కారణం ఆ కంపెనీ తాజాగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీవో)లో భాగంగా 25.6 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.1,82,492 కోట్లు) సేకరించడమే.
ఆయిల్ రిచ్ దేశమైన సౌదీని సమూలంగా మార్చివేయాలనే ఆ దేశ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రణాళికలో భాగంగా ఈ ఐపీవో ప్రజల ముందుకొచ్చింది. ఆరామ్కో షేర్ల విక్రయం ద్వారా సౌదీ ఆర్థిక వ్యవస్థను రీస్టోర్ చేయాలని, యెమెన్ వార్, వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమల్ ఖషోగ్గి హత్యోదంతం ద్వారా గ్లోబల్గా పోయిన పరువును మళ్లీ పొందాలనేది ఆయన భావనగా చెబుతున్నారు.
ఐపీవోతో రూ.1.8 లక్షల కోట్లు...
సౌదీ చమురు రంగ దిగ్గజం ఆరామ్కో తనకున్న 20 వేల కోట్ల షేర్లలో 1.5 శాతాన్ని విక్రయించాలనుకుంటున్నట్లు గత నెలలో ప్రకటించింది. ఈ భారీ ఐపీవో సైజు 29.4 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. అవసరమైతే మరిన్ని షేర్లు అమ్ముతామని కూడా తెలిపింది. చెప్పినట్లుగానే ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీవో ద్వారా రూ.1,82,492 కోట్లను కంపెనీ సేకరించింది.
300 కోట్ల షేర్ల విక్రయం...
ప్రణాళికలో భాగంగా భారీ ఐపీవో ద్వారా ఆరామ్కో 300 కోట్ల షేర్లను విక్రయించింది. ఒక్కో షేరు తుది ధర 32 సౌదీ రియాల్స్.. అంటే 8.53 డాలర్లుగా నిర్ణయించింది. అనుకున్నట్లుగానే 1.7 లక్షల కోట్ల డాలర్లు సేకరించి ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ ఉన్న తొలి కంపెనీగా అవతరించింది. ఈనెల 12 నుంచి రియాద్లోని తద్వుల్ ఎక్స్ఛేంజిలో రియాళ్ల వద్ద ఈ కంపెనీ ట్రేడింగ్ మొదలుకానుంది. ఆరామ్కో షేర్లలో ఎక్కువ భాగం సౌదీ ప్రజలే కొనుగోలు చేశారు. వీరితోపాటుగా పక్కనున్న గల్ఫ్, అరబ్ మోనార్కీలు, ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మదుపుదారులు ఆరామ్కో షేర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
టెక్ దిగ్గజాలనే దాటేసి మరీ...
50 లక్షల మంది ఇండివిడ్యువల్స్ సౌదీ ఆరామ్కో షేర్లు కొనుగోలు చేశారు. మొత్తం 397 బిలియన్ రియాల్స్కు బిడ్స్ వచ్చాయి. తన భారీ ఐపీవోతో సౌదీ ఆరామ్కో టెక్ దిగ్గజాలైన యాపిల్, మైక్రోసాఫ్ట్, అలీబాబాలను సైతం దాటేసి మరీ భారీ మార్కెట్ విలువను చేజిక్కించుకుంది. ఇప్పుడు ఈ కంపెనీ తరువతి స్థానంలో యాపిల్ (1.2 ట్రిలియన్ డాలర్లు), మైక్రోసాఫ్ట్, అలీబాబా ( ఒక్కోటి 1.1 ట్రిలియన్ డాలర్లు) ఉన్నాయి.
అప్పట్లోనే ఐపీవో ప్లాన్, కానీ...
ఆయిల్ రిచ్ కంట్రీ అయిన సౌదీ అరేబియాను ఆ రంగంతోపాటు ఇతర రంగాల్లోనూ అభివృద్ధి చేయాలని ఆ దేశ ప్రస్తుత యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆలోచన. బహుళజాతి కంపెనీలకు, విదేశీ పెట్టుబడిదారులకు తమ దేశాన్ని అత్యంత అనుకూలమైన వ్యాపార కేంద్రంగా మార్చాలని ఆయన భావించారు. ఈ మేరకు విజన్ 2030 ప్లాన్ను కూడా రూపొందించారు. సౌదీ అరేబియా ఎకనామిక్ లిబరలైజేషన్ 2016లో మొదలైంది. నిజానికి 2018లోనే సౌదీ ఆరామ్కో ఐపీవోకు రావాలని భావించింది. ఇందులో ప్రభుత్వానికి ఉన్న షేర్లలో 5 శాతం షేర్లను విక్రయించి 100 బిలియన్ డాలర్లు సేకరించాలని భావించినా.. అప్పట్లో కుదరలేదు.
ఇదీ సౌదీ క్రౌన్ ప్రిన్స్ ప్లాన్...
సౌదీ ఆర్థిక వ్యవస్థని మరింత పరిపుష్టం చేయాలని, యెమెన్ వార్, వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమల్ ఖషోగ్గి హత్యోదంతం ద్వారా గ్లోబల్గా పోయిన పరువును మళ్లీ పొందాలని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ భావిస్తున్నారు. ఒక్క చమురు రంగంలో మాత్రమే కాక ఇతర రంగాలలోనూ తమ దేశ ఆర్థిక వ్యవస్థను మరింతగా అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు.