HDFC కొత్త సీఈవో శశిధర్ జగదీశన్, అందుకే ఓటు!: ఎగిసిపడిన షేర్లు
ముంబై: ప్రయివేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం HDFC కొత్త సీఈవోగా శశిధర్ జగదీషన్ పేరుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఆగస్ట్ 4న ఆమోదముద్ర వేసింది. 25 ఏళ్లుగా బ్యాంకు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆదిత్యపురి సెప్టెంబర్ నాటికి పదవీ విరమణ చేయనున్నారు. దీంతో గతకొంతకాలంగా కొత్త సీఈవోపై చర్చ సాగుతోంది. ఇప్పుడు ఆదిత్యపురి స్థానంలో శశిధర్ జగదీషన్ సీఈవోగా రానున్నారు.
రియల్ ఎస్టేట్, ఉద్యోగులు: బెంగళూరు ఐటీ క్లస్టర్ను మార్చిన వర్క్ ఫ్రమ్ హోమ్!
అందుకే వారసుడి ఎంపిక ఆలస్యం
శశిధర్ జగదీశన్ 27 అక్టోబర్ 2020న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా బాధ్యతలు తీసుకుంటారు. మూడేళ్ల పాటు ఆయన కొనసాగుతారు. ప్రస్తుతం ఈయన గ్రూప్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 25 ఏళ్లుగా పలు విభాగాల్లో సేవలు అందించారు. ఆదిత్యపురికి సమకాలికులు. బ్యాంకు ఎంపిక చేసిన కమిటీ.. ఆదిత్యపురి వారసుడిగా ముగ్గురిని ప్రతిపాదించగా, చివరకు శశిధర్కు ఆర్బీఐ ఓటు వేసింది. కరోనా సవాళ్లు, దేశీయ బ్యాంకింగ్ రంగంలో HDFC ప్రముఖ పాత్ర పోషిస్తోంది. యస్ బ్యాంకు వైఫల్యం వంటి అంశాల నేపథ్యంలో ఆర్బీఐ కూడా సీఈవో ఎంపికలో పలు అంశాలను పరిగణలోకి తీసుకుందని, అందుకే ఎంపిక నిర్ణయం ఆలస్యమైందని అభిప్రాయపడుతున్నారు.
వివిధ బాధ్యతలు
HDFCలో పాతిక సంవత్సరాలుగా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు శశిధర్ జగదీశన్. ఇతర సీనియర్లతో పోలిస్తే వివిధ విభాగాలలో పనిచేసిన అనుభవం అవకాశాలను పెంచిందని చెబుతున్నారు. బ్యాంకుకు సంబంధించిన ఫైనాన్స్ గ్రూప్ హెడ్గా, మానవ వనరులు, లీగల్, సెక్రటేరియల్, పరిపాలన, మౌలిక సదుపాయాలు, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సహా వివిధ విభాగాల్లో సేవలు అందించారు.
ఇది కూడా కారణం..
ఫైనాన్స్ విభాగంలో 1996లో శశిధర్ జగదీశన్ మొదటిసారిబాధ్యతలు చేపట్టారు. 1999 నాటికి ఫైనాన్స్ బిజినెస్ హెడ్ అయ్యారు. తర్వాత 2008లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్వో)గా స్థాయికి ఎదిగారు. HDFC పాతికేళ్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తన వారసుడిని సొంత సిబ్బంది నుంచి ఎంపిక చేసుకోవడం మంచిదని ఆదిత్యపురి భావించారు. ఇందుకే ఎంపిక కమిటీ సైతం ముగ్గురితో కూడిన ప్రతిపాదన చేసినప్పటికీ బ్యాంకులో వివిధ విభాగాలలో అనుభవం ఉన్న శశిధర్ వైపు అధికంగా మొగ్గు చూపినట్లు చెబుతున్నారు.
HDFC షేర్లు జూమ్
బ్యాంకు కొత్త సీఈవోగా శశిధర్ జగదీశన్ ఎంపిక కావడంతో HDFC షేర్లు పుంజుకున్నాయి. కౌంటర్లలో కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. దీంతో షేర్లు ఓ సమయంలో 6 శాతం ఎగిశాయి. చివరకు 3.81 శాతానికి పైగా లాభంతో రూ.1,040 వద్ద ముగిసింది. ఈ బ్యాంకు షేర్ 52 వారాల గరిష్టాన్ని రూ.1,304.10తో 19 డిసెంబర్ 2019న, కనిష్టాన్ని 24 మార్చి 2020న 738.90న తాకింది.