వాట్సాప్కు పోటీ? కేంద్ర ప్రభుత్వం కొత్త మెసేజ్ యాప్
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్కు ధీటుగా కేంద్ర ప్రభుత్వం ఓ యాప్ని తీసుకు వస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. తాజా రిపోర్ట్ ప్రకారం వాట్సాప్ తరహా ఫీచర్స్తో ఓ యాప్ను త్వరలో లాంచ్ చేయనుంది. దీనికి సందేశ్ అని నామకరణం చేసినట్లుగా తెలుస్తోంది. సందేశ్ పేరుతో ఆవిష్కరించనున్న ఈ యాప్ టెస్టింగ్ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఈ యాప్ను ప్రభుత్వ అధికారులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. పరీక్షలో భాగంగా వీరు ఉపయోగిస్తున్నారు.
వాట్సాప్ వంటి యాప్ను ఆవిష్కరించే ఒక ప్రణాళికలను ప్రభుత్వం గత ఏడాది ధృవీకరించిందని, జిమ్స్ (GIMS) పేరుతో ఈ ప్రభుత్వ యాప్ను లాంచ్ చేయనుందనే అంచనాలు వెలువడ్డాయి. అయితే దేశీయంగా సందేశ్ పేరుతో తీసుకురానుందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే దీనిని ఉపయోగానికి కూడా సిద్ధంగా ఉంచిందని సమాచారం. ప్రస్తుతం కొన్ని మంత్రిత్వ శాఖల అధికారులు దీనిని ఉపయోగిస్తున్నారు. సమాచార మార్పిడికోసం ఇప్పటికే కొంతమంది ప్రభుత్వ అధికారులు సందేశ్ యాప్ను ఉపయోగిస్తున్నారని ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం ఈ యాప్ ప్రభుత్వ అధికారులకు మాత్రమే పరిమితం. OTP ఆధారిత లాగిన్ వంటి సెక్యూరిటీ ఫీచర్స్ సహా ఆధునిక చాటింగ్ వంటి ఫీచర్స్తో ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్ఫాంలకు అనుకూలంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ బ్యాకెండ్ సపోర్టు అందిస్తోంది.