భారత ఆర్థిక వ్యవస్థకు క్రూడ్ ధరల షాక్, రష్యా-ఉక్రెయిన్ ప్రభావం మనపై ఎంత అంటే?
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారు భారత్. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 100 డాలర్ల దిశగా కదులుతున్నాయి. నేడు వరల్డ్ టెక్సాస్ ఇంటర్మీడియేట్(WTI) చమురు ధర 91.78 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ ధర 93.60 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు ఇదే విధంగా కొనసాగితే త్వరలోనే 100 డాలర్లకు చేరుకోవచ్చునని అభిప్రాయపడుతున్నారు. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. కానీ మన వద్ద మాత్రం మూడు నెలలకు పైగా స్థిరంగా ఉన్నాయి. అయితే ఇలాగే పెరుగుతుంటే కనుక చమురు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే, రష్యా-ఉక్రెయిన్ దేశాల ఉద్రిక్తతలు ఆ దేశ వాణిజ్యంతో మన సంబంధాల నేపథ్యంలో ప్రభావం ఉంటుంది. యుద్ధం వస్తే దేశాలపై భద్రతాపరంగా, ఆర్థికంగా ప్రతికూల ప్రభావం ఉండవచ్చు.
ధరలు పెరిగే ఛాన్స్
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఇలాగే ఉద్రిక్తతలు కొనసాగితే, యుద్ధం వస్తే చమురు రవాణాకు ఆటంకం ఏర్పడుతుంది. ఇప్పటికే ముడి చమురు బ్యారెల్ ధర ఓ సమయంలో 97 డాలర్లను తాకింది. ఇది చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడిన భారత్ వంటి దేశాలకు షాక్. రష్యా-ఉక్రెయిన్తో వాణిజ్య సంబంధాలు ఉన్న దేశాలకు ఇక్కట్లు తప్పవు. అప్పుడు మన దేశంపై కూడా ప్రభావం ఉంటుంది.
అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం మన వద్ద సామాన్యుడికి ఊరట దక్కింది. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ ఈ ఎన్నికల తర్వాత ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధరలు పెరిగితే ద్రవ్యోల్భణం పెరుగుతుంది. ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రష్యా-ఉక్రెయిన్ పరిణామాలపై పరోక్షంగా స్పందించారు. ఆ దేశాల మధ్య ఉద్రిక్తతలు, పెరుగుతున్న పెట్రోల్ ధరలు భారత ఆర్థిక స్థిరత్వానికి పెను సవాల్ అన్నారు. అంటే రష్యా అధినేత పుతిన్ యుద్ధం దిశగా అడుగు వేస్తే ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా పెట్రోల్, డీజిల్ పెరుగుదలతో పాటు వివిధ ఇక్కట్లు ఎదుర్కొంటుంది. అది అంతిమంగా ద్రవ్యోల్భణంకు దారి తీస్తుంది.
120 డాలర్లకూ చేరుకునే ఛాన్స్
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ తీవ్రత ఇలాగే ఉంటే 100 డాలర్లను దాటి 105 నుండి 120 డాలర్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదని బ్యాంక్ ఆఫ్ అమెరికా గ్లోబల్ రీసెర్చ్ నోట్ పేర్కొంది. ఆ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం మూడు నాలుగు నెలలు కొనసాగితే పై మార్కుకు చేరుకోవచ్చు. అప్పుడు మన వద్ద కూడా ధరలు మండిపోతాయి.
మనపై రష్యా-ఉక్రెయిన్ ప్రభావం
ఉక్రెయిన్కు భారత్ నుండి ఔషధాలు పెద్ద మొత్తంలో ఎగుమతి అవుతాయి. వ్యాల్యూపరంగా ఉక్రెయిన్ ఔషధాల దిగుమతిలో జర్మనీ, ఫ్రాన్స్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. రాన్బాక్సీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ గ్రూప్ వంటి సంస్థలకు అక్కడ కార్యాలయాలు ఉన్నాయి. ఇండియన్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ కూడా ఉంది. ఔషధాల తర్వాత బాయిలర్ యంత్రాలు, మెకానికల్ ఉత్పత్తులు, నూనె గింజలు, పండ్లు, కాఫీ, తేయాకును కూడా భారత్ ఎగుమతి చేస్తోంది. ఇక, ఉక్రెయిన్ నుండి మనకు సన్ ఫ్లవర్ నూనె వస్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక వాణిజ్యం వ్యాల్యూ రూ.19,000 కోట్లు.