వచ్చే ఏడాదికి రూపాయి భారీ పతనమే! మరింత బలహీనత నుండి ఇదే కాపాడుతుంది
అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ రోజు రోజుకు బలహీనపడుతోంది. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఏకంగా రూ.76 రికార్డ్కు చేరుకుంది. రెండు రోజుల క్రితం రూ.76.29 ఆల్ టైమ్ హైకి చేరుకుంది. డాలర్తో రూపాయి సహా ఆసియా దేశాల కరెన్సీలు పతనమవుతున్నాయి. బుధవారం అంతకుముందు ముగింపుతో పోలిస్తే కాస్త కోలుకొని 75.93 వద్ద ఉంది. ఈ నేపథ్యంలో డాలర్తో రూపాయి మారకం విలువ 2020, 2021లో ఎలా ఉంటుందో ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేసింది.
2009 ఆర్థిక సంక్షోభం కంటే పెను ప్రమాదం: ఐఎంఎఫ్ హెచ్చరిక
2020లో రూపాయి ఎలా ఉంటుందంటే?
అమెరికా డాలర్ మారకంతో రూపాయి పతనం ఈ ఏడాది, వచ్చే ఎడాది ఎలా ఉంటుందో ఫిచ్ సొల్యూషన్స్ తన అంచనాను మంగళవారం తెలిపింది. సరాసరిన 2020లో రూపాయి విలువ 77 వరకు ఉండవచ్చునని పేర్కొంది. ప్రపంచ మార్కెట్ రిస్క్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపాయి ఈ స్థాయికి పడిపోతుందని తెలిపింది.
2021లో రూ.80కి రూపాయి
ద్రవ్య సడలింపు, రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ మధ్య 2021లో డాలర్ మారకంతో రూపాయి రూ.80కి చేరుకోవచ్చునని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 5.4 శాతంగా ఉండవచ్చునని, ఆ తర్వాత ఏడాది 5.8గా ఉండవచ్చునని అంచనా వేసింది.
పాక్షిక ప్రతిఘటన
గ్లోబల్ రిస్క్ ఆఫ్ సెంటిమెంట్, ద్రవ్య సడలింపు ప్రభావం రూపాయిపై ఒత్తిడి పెంచుతుందని, దీంతో రూపాయి బాగా బలహీనపడే అవకాశాలు ఉంటాయని, అయినప్పటికీ భారత వాణిజ్య నిబంధనలలో గణనీయమైన పెరుగుదల నేపథ్యంలో పాక్షిక ప్రతిఘటన కొనసాగుతుందని ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది.
భారీ పతనమే..
వివిధ పరిణామాల నేపథ్యంలో 2020లో రూపాయి సగటున INR77.00/USD, 2021లో INR80.00/USD ఉండవచ్చునని అంచనా వేసింది. ఇదివరకు 2020లో రూ.73, 2021లో రూ.75గా ఉంటుందని పేర్కొంది. ఇప్పుడు దీనిని సవరించింది. అంటే అంతర్జాతీయ మార్కెట్లు సహా వివిధ పరిణామాల నేపథ్యంలో రూపాయి ఈ ఏడాది, వచ్చే ఏడాది భారీగానే పతనం కానున్నదని ఈ అంచనా వెల్లడిస్తోంది.
జనవరి నుండి 7 శాతం
ఈ ఏడాది జనవరి నుండి ఇండియన్ రూపాయి అమెరికా డాలర్ మారకంతో 7 శాతం మేర నష్టపోయింది. రూ.72 నుండి ఇప్పుడు రూ.76 పైన కూడా ఉంది.
యస్ బ్యాంకు మొదలు.. కరోనా
ప్రారంభంలో యస్ బ్యాంకు రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ వంటి వివిధ పరిణామాలతో రూపాయి బలహీనత ప్రారంభమైందని, ఆ తర్వాత కరోనా వైరస్ నేపథ్యంలో పెట్టుబడిదారుల ఆందోళలు ఎక్కువయ్యాయని, ఈ ప్రభావం పడిందని ఫిచ్ సొల్యూషన్స్ పేర్కొంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు పెరుగుతున్నాయని తెలిపింది.
ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిని
కరోనా కారణంగా బలహీనమైన ఎకనమిక్ డేటా ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ సెంటిమెంట్ను భారీగా దెబ్బతీస్తోందని ఫిచ్ సొల్యూషన్స్ పేర్కొంది. ఈ ప్రభావం భారత కరెన్సీపై తీవ్రంగా పడిందని తెలిపింది.
రూపాయి మరింత పతనమవకుండా.. కాపాడుతుంది..
మార్చి ఆరంభంలో సౌదీ అరేబియా, రష్యా చమురు ధరల తగ్గింపు యుద్ధం కారణంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర తగ్గింది. బ్యారెల్ చమురు 50 అమెరికా డాలర్ల నుండి 30 డాలర్లకు పడిపోయింది. ఇది ఇండియాకు వాణిజ్యపరంగా మెరుగుపడేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు. 80 శాతం చమురు దిగుమతులపై ఆధారపడినందున సమీప భవిష్యత్తులో ప్రయోజనకరమనిచెబుతున్నారు. రూపాయి మరింత బలహీనం కాకుండా ఇది ఉపయోగపడుతుందని ఫిచ్ సొల్యూషన్స్ పేర్కొంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర అంచనాను గతంలో 62 డాలర్లు అంచనా వేయగా ఇప్పుడు 43.20 డాలర్లకు తగ్గించింది. ఆ తర్వాత చమురు ధరలు పెరిగితే మాత్రం రూపాయి బలహీనపడుతుంది.