ఇప్పటికే బంగారం 'జీరో', చమురు ధరలు ఇలాగే ఉంటే రూపాయికి ప్లస్
కరోనా సంక్షోబం నుండి దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమాగా ప్రకటించిన నేపథ్యంలో దేశీయ కరెన్సీ రూపాయి అమెరికా డాలర్ మారకంతో పోలిస్తే బలపడింది. మంగళవారం డాలర్ మారకంతో రూపాయి 75.57 వద్ద ప్రారంభమై ఆ తర్వాత పుంజుకుంది. చివరకు 18 పైసలు లాభపడి 75.36 వద్ద ముగిసింది. అంతకుముందు సెషన్లో 75.54 వద్ద స్థిరపడింది.
ఇతర కరెన్సీలతో పోలిస్తే తగ్గిన డాలర్ ఇండెక్స్
ముడి చమురు బ్రెంట్ ఫ్యూచర్స్ 2.14 శాతం పెరిగి బ్యారెల్కు 39.14 డాలర్లకు చేరుకుంది. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ 0.27 శాతం తగ్గి 97.57 వద్దకు చేరుకుంది. సానుకూల దేశీయ ఈక్విటీలు, బలహీనమైన అమెరికన్ డాలర్, విదేశీ నిధుల ప్రవాహం.. పెట్టుబడిదారుల సెంటిమెంట్కు పాజిటివ్గా ఉందని ఫారెక్స్ వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్లు వరుసగా ఐదో సెషన్లో లాభపడ్డాయి. మోడీ ప్రకటన తర్వాత మరింత పుంజుకున్నాయి. నిన్న సెన్సెక్స్ 522 పాయింట్లు, నిఫ్టీ 153 పాయింట్ల లాభంతో ముగిసింది.
చమురు ధరలు ఇలాగే ఉంటే..
అంతర్జాతీయ ముడిచమురు ధరలు ప్రస్తుత ధరల వద్దే మరికొంతకాలం ఉంటే రూపాయి మారకపు విలువలో స్థిరత్వం కొనసాగే అవకాశం ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. ద్రవ్యలోటు కూడా అదుపులోనే ఉంటుందన్నారు. చమురు ధరలు ప్రస్తుత స్థాయిలో ఉంటే రూపాయిపై పెద్దగా ఒత్తిడి ఉండదని చెప్పారు.
అలా రూపాయిపై ఒత్తిడి తగ్గుతుంది
చమురు ధరలు ప్రస్తుత ధరల్లోనే ఉంటే రూపాయిపై ఒత్తిడి ఉండదని, మనం ఎక్కువగా ముడిచమురు, బంగారాన్ని దిగుమతు చేసుకుంటామని రజనీష్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం పసిడి దిగుమతులు గత రెండు నెలలుగా దాదాపు జీరోకు పడిపోయాయని గుర్తు చేశారు. ధరలు తగ్గడంతో ముడి చమురు దిగుమతుల వ్యయం కూడా తగ్గిందన్నారు. కాబట్టి రూపాయిపై ఒత్తిడి పెద్దగా ఉండదని భావించవచ్చునని చెప్పారు.
75 నుండి 76 మధ్య
ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను పరిగణలోకి తీసుకుంటే ముందు ముందు ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని రజనీష్ కుమార్ తెలిపారు. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 75 నుండి 76 మధ్య ఉంది. కాగా, బ్రెంట్ క్రూడాయిల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్కు 39గా ట్రేడ్ అవుతోంది. మంగళవారం ఇండియాకు వచ్చే ధర 35 డాలర్లుగా ఉంది. బంగారం దిగుమతి తగ్గడం, చమురు ధరలు ఇలాగే ఉండటం, కేంద్రం చర్యలతో రూపాయి నిలకడగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.